పీఎన్బీ స్కాంలో నీరవ్, ఛోక్సీలకు షాక్: అరెస్ట్ వారెంట్ జారీ
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీలకు భారీ షాక్ తగిలింది. స్కాం కేసుపై సీబీఐ, ఈడీలు విస్తృతదాడులు చేస్తూ, ఆస్తులను స్వాధీనం చేసుకుంటుండగా.. శనివారం నీరవ్, ఛోక్సీలకు ముంబై స్పెషల్ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
విదేశాల్లో వ్యాపార వ్యవహారాల నిమిత్తం విచారణ హాజరుకాలేనని మొండికేసిన నీరవ్ మోడీకి వచ్చే వారం కచ్చితంగా విచారణకు హాజరుకావల్సిందేనంటూ ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు హైకమిషన్ను సంప్రదించాలని మోడీ, చోక్సీలను సీబీఐ కోరింది. వారి ప్రయాణ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. దాదాపు 12వేలకోట్ల రూపాయల కుంభకోణం కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ మోడీ, చోక్సిల చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వేలకోట్లను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, చోక్సీలకు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతోపాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే సీబీఐ పీఎంఎల్ఎ కోర్టును కోరాయి.