పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ లాయర్ ఎవరో తెలుసా?, 2జీ, సహా పలు వివాదాలు
Recommended Video
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 11వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నగల వ్యాపారి నీరవ్ మోడీ ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదితో వాదింపజేసి కేసు నుంచి బయటపడేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నీరవ్ మోడీ, చోక్సీకి ఈడీ సమన్లు: 4వారాలపాటు పాస్పోర్ట్ సస్పెన్షన్
ఈ నేపథ్యంలోనే దేశంలో ఇప్పటి వరకు ఎంతో కీలకమైన కేసులను వాదించిన విజయ్ అగర్వాల్ అనే న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ రంగం సిద్ధం చేసుకున్నారు.
2జీ కేసు వాదించిన లాయర్
ఇప్పటికే దేశంలో సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం కేసులో అనేకమంది నిందితుల తరపున వాదించిన విజయ్ అగర్వాల్.. ఇటీవల ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఐఎం ఖురేషి తరపున కూడా వాదించారు. పలు కీలక ఫోన్ సంభాషణలు లీక్ అవ్వడంతో ఖురేషీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ విచారణ
తాజాగా బయటపడిన పీఎన్బీ కుంభకోణంలో రూ.11 వేల కోట్ల మేర జరిగిన అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ సహా ఆయన కుటుంబసభ్యులు గత జనవరి నెలలోనే విదేశాలకు వెళ్లిపోయారు. పీఎన్బీ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది.
మోడీ లాయర్ అగర్వాల్-పలు వివాదాలు
కాగా, పీఎన్బీ కుంభకోణం కేసులో నీరవ్ తరపున వాదించనున్న విజయ్ అగర్వాల్ చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి. 2011లో ఆయన ‘వృత్తిపరమైన ప్రవర్తన బాగోలేదంటూ' న్యాయవాదుల నియంత్రణా సంస్థ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2జీ స్కాం కేసులో స్వాన్ టెలీకామ్ ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బాల్వా, వినోద్ గోయెంకా సహా పలువురి నిందితుల తరపున అగర్వాల్ వాదించారు. ఏకకాలం న్యాయవాద వృత్తితో పాటు మరో క్రియాశీలక వృత్తిలోనూ కొనసాగడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన నిబంధనలకు విరుద్ధంగా చార్టర్డ్ అకౌంటెన్సీలో కూడా పనిచేయడంపై వివరణ కోరింది.
అగర్వాల్పై మోడీ ఆశలు
2013లో అగర్వాల్ ‘ప్రవర్తన బాగోలేదంటూ' న్యూఢిల్లీ బార్ అసోసియేషన్ (ఎన్డీబీఏ) అగర్వాల్ను బహిష్కరించింది. ‘ఓ లాయర్ను బెదిరించడం, కోర్టు ఆవరణంలోకి బౌన్సర్లను పిలవడం' వంటి ఆరోపణలతో పటియాలా హౌస్ కోర్టుల సముదాయంలోని ఆయన చాంబర్ను మూసివేయించింది. అయితే తనను అక్రమంగా బహిష్కరించారనీ.., ఎన్డీబీఏ అధ్యక్షుడు ‘తన క్లయింటు ప్రయోజనాల కోసం పదవిని దుర్వినియోగం' చేస్తున్నారని అప్పట్లో అగర్వాల్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 2జీ కేసులో నిందితులుగా ఉన్నవారు ఇటీవల నిర్దోషులుగా విడుదలలైన నేపథ్యంలో.. పీఎన్బీ కుంభకోణం నుంచి తనను విజయ్ అగర్వాల్ బయటపడేస్తారని నీరవ్ మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.