పీఎన్బీ స్కాం: 17 చోట్ల ఈడీ సోదాలు, 120 షెల్ కంపెనీల గుట్టు రట్టు, నీరవ్ ఫామ్హౌస్ సీజ్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం ముంబైలోని 17 చోట్ల సోదాలు నిర్వహించారు. షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న నాలుగు బడా సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు నీరవ్ మోడీ ఆస్తులపై సీబీఐ కూడా దాడులు ఉధృతం చేసింది. బుధవారం నీరవ్ మోడీ ఫౌమ్హౌస్కు సీబీఐ సీల్ వేసింది. మహారాష్ట్రలోని అలీబాగ్లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్హౌస్ ఉంది. ఇందులో ఒక బంగళా కూడా ఉంది.
ఏకంగా 120 షెల్ కంపెనీలు పెట్టారు...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీ ఎత్తున శఠగోపం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు 120 షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో తాజాగా బయటపడింది. వీటిలో 79 కంపెనీలకు మెహుల్ చోక్సీ, 41 షెల్ కంపెనీలకు నీరవ్ మోడీ యజమానులుగా ఉన్నట్లు సమాచారం.
Recommended Video
పీఎన్బీ సొమ్ము షెల్ కంపెనీలకు...
నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఈ షెల్ కంపెనీలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, వారి కుటుంబసభ్యులు ఈ ఏడాది జనవరి నెలలోనే దేశం విడిచి పారిపోగా, ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నసంగతి తెల్సిందే.
నీరవ్ మోడీ ఫౌమ్హౌస్ సీల్...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11,300 కోట్ల మేర రుణాలు ఎగవేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆస్తులపై ఒకవైపు ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా మరోవైపు సీబీఐ కూడా తన దాడులు ఉధృతం చేసింది. బుధవారం మహారాష్ట్రలోని అలీబాగ్లో నీరవ్ మోడీకి చెందిన ఫౌమ్హౌస్కు సీబీఐ సీల్ వేసింది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్హౌస్లో ఒక బంగళా కూడా ఉంది.
పీఎన్బీ జీఎం రాజేష్ జిందాల్ అరెస్ట్...
పీఎన్బీ కుంభకోణంపై పలు కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్ను అరెస్టు చేసింది. 2009 నుంచి 2011 మే వరకూ పీఎన్బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ హెడ్గా జిందాల్ ఉన్నారు. ఆయన హయాంలోనే నీరవ్ గ్రూప్ సంస్థలకు పరిమితికి మించి ఎల్ఓయూలు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. జిందాల్ ప్రస్తుతం న్యూఢిల్లీ పీఎన్బీ హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ క్రెడిట్గా ఉన్నారు. మంగళవారం ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ విపుల్ అంబానీని కూడా సిబీఐ అరెస్టు చేసింది.