పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీకి ఈడీ షాక్, రూ.637కోట్ల ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 13వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్ని చర్యలు చేపట్టింది. నీవర్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
భారత్ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్లు, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు పేర్కొంది. దర్యాప్తులో భాగంగా భారత ఏజెన్సీ విదేశాల్లోని నిందితుల ఆస్తులను జప్తు చేసిన కేసులు చాలా అరుదు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్ మోడీ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య నానావటిపై ఇంటర్ పోల్ రెడ్ కర్నార్ నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించింది. పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారులైన నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలు ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.