పీఎన్బీ స్కాం: సంచలన విషయాలను వెల్లడించిన గోకుల్నాథ్ శెట్టి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి సంచలన విషయాలను సీబీఐ విచారణలో వెల్లడించారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తానే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోయూ)లను జారీ చేసినట్టు ఒప్పుకొన్నాడు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్మెయిల్ చేశారని ఈడీ విచారణలో ఆయన ఒప్పుకొన్నాడు,. అయితే ఈ విషయంలో తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను పొందలేదని ఆయన వివరించారు.
2010లో నీరవ్ మోడీకి తొలిసారిగా ఎల్వోయూను తానే జారీ చేశానని గోకుల్నాథ్ శెట్టి ఈడీ విచారణలో ఒప్పుకొన్నాడు.అయితే ఈ విషయమై ఇద్దరు వ్యాపారులు తనను బ్లాక్మెయిళ్ళకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. ఈ కారణంగానే తాను 2017 వరకు ఎల్వోయూలు జారీ చేసినట్టు చెప్పారు. సుమారు రూ.17,500 కోట్ల విలువైన ఎల్వోయూలను జారీ చేసినట్టు ఆయన చెప్పారు.
2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్బీ బ్రాడీహౌస్ బ్రాంచ్కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించారని గోకుల్నాథ్శెట్టి చెప్పారు.
ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఆయన ఈడీ విచారణలో చెప్పారు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదన్నారు.