పీఎన్బీ స్కాం: నేను ఇండియాకు రాను.., సీబీఐకి మెహుల్ చోక్సీ ఘాటైన లేఖ!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ సీబీఐకి ఓ ఘాటైన లేఖ రాశాడు. 'నా పాస్పోర్ట్ను సస్పెండ్ చేశారు. నా పాస్పోర్టు రద్దుకు కారణమేంటో ముంబై రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ వివరణ ఇవ్వలేదు. నాతో దేశానికి వచ్చిన ముప్పేంటో చెప్పలేదు..' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.
Recommended Video
12,600 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్మోడీతోపాటు చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న నీరవ్మోడీ, చోక్సీతోపాటు ఇతర కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కాం బయటపడకముందే వీరంతా దేశం వదిలి పారిపోయారు.
తనకు వ్యతిరేకంగా మీడియా జరుపుతున్న విచారణ కారణంగానే పాస్పోర్ట్ రద్దు చేశారని కూడా సీబీఐకి రాసిన 7 పేజీల లేఖలో మెహుల్ చోక్సీ ఆరోపించాడు. భారత్ వస్తే తన కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందని, విచారణ కూడా పక్షపాతంగానే జరుగుతుందని పేర్కొన్నాడు. తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, తనను అరెస్ట్ చేస్తే సరైన వసతులు కూడా ఇవ్వరన్న ఆందోళన తనకు ఉన్నట్లు పేర్కొన్నాడు.
అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు ప్రయాణించే పరిస్థితుల్లో కూడా తాను లేనని, తనకు గుండె సంబంధిత చికిత్స జరుగుతోందని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం కూడా ఇస్తారో లేదో తెలియదని, అందుకే తాను ఇండియాకు రాదలుచుకోలేదని మెహుల్ చోక్సీ పేర్కొన్నాడు.