పీఎన్బీ ఫ్రాడ్, నీరవ్ మోడీ భారీ స్కాం: సుప్రీం కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీరవ్ మోడీ ఉదంతంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో దర్యాఫ్తు చేయించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వారం రోజుల క్రితం నిరవ్ మోడీ రూపంలో భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అతనిపై రూ.11,400 కోట్లు, రూ.280 కోట్ల ఫైనాన్షియల్ ఫ్రాండ్ కేసులు నమోదయ్యాయి. అతను ఇప్పటికే విదేశాలకు పారిపోయాడు.
ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ ఛోక్సీ, ఇతరులకు చెందిన బినామీ ఆస్తులు, డొల్ల కంపెనీలపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దృష్టి సారించాయి.
కనీసం 200 డొల్ల సంస్థలు, బినామీ ఆస్తులను జల్లెడ పట్టే పని ప్రారంభించారు. ఆదివారం వరుసగా నాలుగో రోజు కూడా ఈ కంపెనీలు, ప్రాంగణాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.