నీరవ్ మోడీ, చోక్సీకి ఈడీ సమన్లు: 4వారాలపాటు పాస్పోర్ట్ సస్పెన్షన్
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో భారీ మొత్తం (సుమారు రూ. 11,400)కోట్ల కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. నీరవ్తో పాటు ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీకి సమన్లు ఇచ్చారు.
Recommended Video
వారంలోగా వీరిద్దరూ ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ దేశంలో లేకపోవడంతో వారి వ్యాపార సంస్థల డైరెక్టర్లకు ఈ సమన్లు అందజేశారు.
భారీ కుంభకోణం
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన ముంబయిలోని ఓ శాఖలో రూ. 11,400కోట్ల కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. నీరవ్మోడీ, మరో ఆభరణాల కంపెనీ తమ బ్యాంకు ద్వారా మోసపూరిత లావాదేవీలపాల్పడినట్లు పీఎన్బీ ఫిర్యాదు చేసింది.
అక్రమంగా రుణాలు
పీఎన్బీ నుంచి అక్రమంగా లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లను తీసుకెళ్లి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి రుణాల పొందినట్లు పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు గురువారం నీరవ్ మోడీకి చెందిన పలు షోరూంలు, ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది.
50సంస్థలపై దాడులు.. పాస్ పోర్టుల సస్పెన్షన్
ఈ తనిఖీల్లో రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, నగలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. శుక్రవారం కూడా నీరవ్ మోడీకి సంబంధమున్న 50కిపైగా సంస్థలపై దాడులు జరుపుతున్నారు. కాగా, నీరవ్, ఆయన భార్య, సోదరుడు, చోక్సీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ సూచన మేరకు నీరవ్ మోడీ, చోక్సీల పాస్పోర్ట్లను నాలుగు వారాలపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.
న్యూయార్క్లోని విలాసభవంతిలో..
మరోవైపు ఈ కుంభకోణం వెలుగుచూడటానికి చాలా రోజుల ముందే(ఈ ఏడాది జనవరి1న) నీరవ్, ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వామి దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో నీరవ్ ఆచూకీ కోసం సీబీఐ అధికారులు ఇంటర్పోల్ను ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం నీరవ్ మోడీ న్యూయార్క్లో తన లగ్జరీ జువెల్లరీ స్టోర్కు దగ్గర్లో జేడబ్ల్యూ మారియట్ ఎస్సెక్స్ హౌజ్లో ఉన్నట్టు తెలుస్తోంది.