పీఎన్బీ స్కాంపై చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టు, ‘పీఎన్బీ మాట మార్చింది’
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) భారీ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని రెండు నెలల్లోగా తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జడ్జీలు జస్టిస్ ఏఎం ఖన్వీకర్, డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం చట్టబద్ధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దర్యాప్తు జరుగుతోంది..
కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపించారు. ఇప్పటికే పీఎన్బీ స్కాం కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. ప్రత్యేక సిట్ దర్యాప్తునకు కేంద్రం విముఖత చూపింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు.
నీరవ్ పారిపోలేదు..
విచారణ పూర్తయిన అనంతరం నీరవ్ మోడీ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోలేదని, ఆయన తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఆయన పాస్ పోర్టును కూడా రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మాట మార్చిన పీఎన్బీ
నీరవ్ చేసిన వాణిజ్య లావాదేవీలను మోసాలుగా పీఎన్బీ చూపిస్తోందని నీరవ్ మోడీ తరపు న్యాయవాది ఆరోపించారు. మొదట రూ.280కోట్లు మోసం జరిగిందని పీఎన్బీ చెప్పుకొచ్చిందని, ఆ తర్వాత 11,400కోట్లు అని ఎలా చెప్తుందని ప్రశ్నించారు.
భారీ మొత్తంలో కమిషన్లు
వాణిజ్య లావాదేవీలు జరిపినందుకు గానూ పీఎన్బీ భారీ మొత్తంలోనే కమిషన్ తీసుకుందని, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు కోవడం లేదని నీరవ్ తరపు న్యాయవాది ఆరోపించారు. కాగా, స్కాం వెలుగుచూసిన తర్వాత దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీ న్యూయార్క్, దుబాయ్లలో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.