పంజాబ్ బ్యాంక్ కుంభకోణం కేసు: మెహుల్ చోక్సీకి చెందిన 218కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఢిల్లీ: కొన్ని వేల కోట్లు రుణాలు తీసుకుని ఆ తర్వాత బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి దేశాలు దాటిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ మెహుల్ చోక్సీకి సంబంధించి రూ.218 కోట్లు మేరా విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద చోక్సీ ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా ముంబైలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి చెందిన జోనల్ ఆఫీస్కు ప్రొవిజనల్ ఆర్డర్లు పంపినట్లు ఈడీ పేర్కొంది.
నీరవ్ మోడీకి ఈడీ షాక్, రూ.637కోట్ల ఆస్తుల జప్తు
ఈ ఆస్తులు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ, మిహర్ భన్సాలీ, నీరవ్ మోడీ, ఏపీ జెమ్స్ అండ్ జువెలరీ పార్క్కు చెందినవిగా ఈడీ గుర్తించింది. మొత్తం రూ.218.46 కోట్లు ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. విచారణ సంస్థ సీబీఐతో కలిసి ఈడీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. నీరవ్ మోడీ, చోక్సీలు ఇద్దరు కలిసి రూ.13వేల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎగొట్టి దేశం దాటి పోయారు.
ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీ చివరిసారిగా కరేబియన్ దేశాల్లో ఒకటైన అంటిగ్వాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈకేసుకు సంబంధించి ఇంటర్ పోల్ భన్సాలీకి రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చింది. మరోవైపు నీరవ్ మోడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్ని చర్యలు చేపట్టింది. నీవర్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. భారత్ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్లు, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు పేర్కొంది. దర్యాప్తులో భాగంగా భారత ఏజెన్సీ విదేశాల్లోని నిందితుల ఆస్తులను జప్తు చేసిన కేసులు చాలా అరుదు.