నీరవ్ మోడీ స్కాంలో ట్విస్ట్! అలహాబాద్ బ్యాంకులోనూ అలాగే, పట్టించుకోని యూపీఏ ప్రభుత్వం!?
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ స్కాంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. అలహాబాద్ బ్యాంకు నుంచి కూడా నీరవ్ మోడీ గ్రూప్ రుణాలు తీసుకుందని, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సునీల్ మెహతా అప్పట్లో అలహాబాద్ బ్యాంకు జనరల్ మేనేజర్గా ఉండే వారని సమాచారం.
అంతేకాదు, అలహాబాద్ బ్యాంకులో నీరవ్ మోడీ ఆగడాలను గతంలో యూపీఏ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేశారట. ఈ విషయాన్ని యూపీఏ ప్రభుత్వంచే ఆ బ్యాంకులో ప్రభుత్వ డైరెక్టరుగా నియమితులైన దినేశ్ దూబే.. శుక్రవారం స్వయంగా మీడియాకు వెల్లడించడం పెనుదుమారం రేకెత్తిస్తోంది.
2013 సెప్టెంబరు నాటి మాట...
దినేశ్ దూబే వృత్తిరీత్యా పాత్రికేయుడు. ఆయన్ని 2012 ఆగస్టులో అప్పటి యూపీఏ ప్రభుత్వం అలహాబాద్ బ్యాంకు బోర్డులో ప్రభుత్వం తరుపున డైరెక్టర్గా నియమించింది. 2013 సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ బ్యాంకు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశం ఎంజెండాలోని నెం.4/6లో నీరవ్ మోడీ మేనమామ మెహుల్ చోక్సీ యాజమాన్యంలోని గీతాంజలి జెమ్స్కు రూ.50 కోట్ల రుణం మంజూరు అంశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనను దూబే వ్యతిరేకించారు. ఈ రుణం మంజూరు చేయాలంటే గతంలో తీసుకున్న రూ.1500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలంటూ ఆయన అసమ్మతి నోట్ కూడా పెట్టారట.
అయినా మంజూరైన రుణం..
అయినా సరే గీతాంజలి జెమ్స్కు రూ.50 కోట్ల రుణం మంజూరైందని, ఈ విషయం తెలియగానే తీను తీవ్ర ఆవేదనకు గురయ్యానని దినేశ్ దూబే తెలిపారు. నిజానికి తాను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పుడు కూడా అలహాబాద్ బ్యాంకు బోర్డుతో చాలా ఘర్షణ జరిగిందన్నారు. ఈ విషయంలో తనకు నచ్చజెప్పేందుకు వారు తీవ్ర ప్రయత్నిం చేశారని, తాను వినకపోవడంతో చివరికి బెదిరింపులకు దిగారని, దీంతో ఈ విషయం గురించి తాను అప్పట్లోనే ఆర్బీఐకి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసెస్కు లేఖ రాశానని చెప్పారు. తీసుకున్న రుణాలు తిరిగి బ్యాంకుకు చెల్లించకుండా పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకుంటున్నారని, మెహుల్ చోక్సీ సంస్థలపై నిఘా పెట్టాలని తాను ఆ లేఖలో సూచించానని దినేశ్ దూబే తెలిపారు.
నా పద్ధతే మార్చుకోమన్నారు...
అక్రమాలను ఎత్తిచూపినందుకు అభినందించాల్సింది పోయి అలహాబాద్ బ్యాంకు బోర్డు పెద్దలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు తననే పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరించారని దినేశ్ దూబే వెల్లడించారు. పైపెచ్చు తనకు ఇష్టం లేకపోతే ఆరోగ్య కారణాలను చూపించి రాజీనామా చేయమని సూచించారని, దీంతో ఈ అవినీతిని సహించలేక తాను 2014 ఫిబ్రవరిలో తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని, రాజీనామాకు ముందు 2013 నవంబరు నెలలో మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తాను డిసెంట్ నోట్ పంపానని, దీనిపై అలహాబాద్ బ్యాంక్ అప్పటి ఛైర్మన్, బోర్డు సభ్యులు తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఇంత భారీ కుంభకోణం జరిగేదే కాదు....
నిరవ్ మోడీ మేనమామ మెహుల్ చోక్సీ అవినీతి గురించి తాను చెప్పినప్పుడే గనుక యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే వారి ఆగడాలు మరీ ఇంతగా పెరిగేవి కావని, ఇప్పుడీ స్థాయి కుంభకోణం చోటుచేసుకుని ఉండేది కాదని దినేశ్ పేర్కొన్నారు. ప్రస్తుత పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా అప్పట్లో అలహాబాద్ బ్యాంకు జనరల్ మేనేజర్గా పని చేసేవారని, ఆనాడు బోర్డు మీటింగుల్లో ఏం జరుగుతోందో ఆయనకూ అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. చోక్సీ, ఆయన సంస్థ భారీ కుంభకోణం ఏదో ఓ రోజు బయటపడుతుందని తాను ఆనాడే అలహాబాద్ బ్యాంకు బోర్డుకు చెప్పానని దినేశ్ దూబే తెలిపారు.