నిర్దిష్టమైన ప్రణాళికతో రా: నీరవ్ మోడీకి పిఎన్బీ ఘాటు రిప్లై
ముంబై: తనను సర్వనాశనం చేశారంటూ లేఖ రాసిన నీరవ్ మోడీపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీరవ్ మోడీ రాసిన లేఖకు పిఎన్బీ తీవ్రంగా ప్రతిస్పందించింది.
నీరవ్ కంపెనీలకు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ అక్రమమైనవని, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ చట్టాన్ని అవి ఉల్లంఘించేలా ఉన్నాయని, అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అందువల్లనే కుంభకోణాన్ని బయటకు వెల్లడించామని చెప్పింది.
మొత్తం మనీ లాండరింగ్ కిందికి...
నీరవ్ మోడీ సాగించిన మొత్తం రుణ ప్రక్రియ మనీ లాండరింగ్ కిందికి వస్తుందని పిఎన్బీ తేల్చింది. "మీరు ఎల్ఓయూలను అక్రమంగా పొందారు. కొందరు బ్యాంకు అధికారుల సాయంతో అనధికారికమైన పద్ధతిల వాటీని వాడుకున్నారు. ఇలాంటివాటిని బ్యాంక్ ఉపేక్షించదు. ఈ అక్రమ కార్యకలాపాలు ఎఫ్ఈఎంఎ, మనీ లాండరింగ్ ఉల్లంఘనల కిందికి వస్తాయి" అని పీఎన్బీ జనరల్ మేనేజర్ అశ్విని వాట్స్ అన్నారు.
నీరవ్ మోడీ రాసిన లేఖకు రిప్లై
నీరవ్ మోడీ రాసిన లేఖకు పిఎన్బీ జనరల్ మేనేజర్ అశ్విని వాట్స్ లేఖ ద్వారా బదులిచ్చారు. ఈ కార్యకలాపాలను లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టికి తీసుకుని రావాలని బ్యాంకు నిర్ణయించిందని చెప్పారు.
నీరవ్ మోడీ లేఖ ఇలా..
బ్యాంకు యాజమాన్యం అత్యుత్సాహంతో వ్యవహరంచి, తన దారులను అన్నింటినీ మూసివేసిందని ఆరోపిస్తూ బ్యాంక్ యాజమాన్యానికి నీరవ్ మోడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. తన బ్రాండును దెబ్బ తీశారని కూడా ఆరోపించారు.
ఆస్తులు విక్రయించి చెల్లించడానికి...
పిఎన్బీ తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేసిందని నీరవ్ మోడీ అన్నారు. ఇప్పటికైనా ఫైర్స్టార్ గ్రూపు ఆస్తులను విక్రయించి బాకీలు తీర్చే అవకాశం ఇవ్వాలని ఆన కోరాడు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దానికి పిఎన్బీ ఘాటుగా స్పందించింది. బాకీలను రికవర్ చేయడానికి తాము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నట్లు తేల్చి చెప్పింది.
నిర్దిష్టమైన, ఆచరణసాధ్యమైన ప్రణాళికతో రా..
అక్రమంగా జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ (ఎల్ఓయూ)ల ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో రావాలని పిఎన్బి తాను రాసిన లేఖలో నీరవ్ మోడీకి సూచించింది. అటువంటి ప్రణాళిక ఏదైనా ఉంటే తమకు చెప్పాలని రాసింది.