ఏ తప్పూ చేయలేదు, అక్రమ కేసులు: మెహుల్ చోక్సీ వీడియో కలకలం
Recommended Video
ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ఛైర్మన్ మెహుల్ ఛోక్సీ విడుదల చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు నమోదు చేశారని వాదిస్తున్న ఛోక్సీ తాజాగా అదే వాదనను మరోసారి వినిపించారు.
తనను తాను సమర్థించుకుంటూ మొట్టమొదటిసారిగా ఆంటిగ్వా నుంచి వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. తనపై చేసిన ఆరోపణల అవాస్తవాలనీ, నిరాధారమైనవని చెప్పారు. ఈడీ అధికారులు తనపై అక్రమ కేసులు బనాయించారని, చట్ట విరుద్ధంగా తన ఆస్తులను సీజ్ చేశారని ఆరోపించారు.
జాడ తెలిసింది: నీరవ్ మోడీ యూకేలోనే, భారత్ రప్పించేందుకు సీబీఐ యత్నాలు
భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్పోర్ట్ పునరుద్ధరణకు భారీ ప్రయత్నాలు చేశానని, కానీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. పాస్ పోర్టును ఎందుకు రద్దు చేశారో చెప్పలేదు, తన వల్ల దేశానికి ఎలాంటి ప్రమాదం ఉందో ముంబైలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం వివరణ ఇవ్వలేదని తెలిపారు. పాస్ పోర్ట్ రద్దు చేసిన అనంతరం ఇక తాను లొంగిపోవడం అనే ప్రశ్నే లేదని చోక్సీ తేల్చి చెప్పారు.
#WATCH PNB Scam accused Mehul Choksi on his passport revocation. Please note: ANI questions were asked by Mehul Choksi's lawyer in Antigua. pic.twitter.com/dwuPnOPaxd
— ANI (@ANI) September 11, 2018
కాగా, సుమారు 14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో మెహుల్ చోక్సీ.. నీరవ్ మోడీ తర్వాత కీలక నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు చోక్సీ పాస్ పోర్టును రద్దు చేశారు. అలాగే గత నవంబర్లో ఆంటిగ్వా పౌరసత్వాన్ని స్వీకరించిన చోక్సీ అక్కడే తలదాచుకున్నారు.
ఛోక్సీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్కు దరఖాస్తు పెట్టుకున్న ఈడీ.. తాజాగా మరో 'రిమైండర్ నోటీసు' పంపింది. పీఎన్బీని దాదాపు 14వేల కోట్ల మేర మోసం చేసి, ఛోక్సీ దేశం నుంచి పారిపోయాడు. అలాగే పీఎన్బీ స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు నీరవ్ మోడీ కుటుంబసభ్యులు(సోదరి పూర్వీ దీపక్ మోడీ, సోదరుడు నీషల్ మోడీ) రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన అనంతరం చోక్సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.