‘పీఎన్బీ స్కాం’! మీకు తెలీకుండా జరిగిందా?: ఆర్బీఐని నిలదీసిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన 11వేల కోట్ల భారీ కుంభకోణం ఎందుకు బయటపడలేదని కేంద్రం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)ను ప్రశ్నించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఏం జరిగినా ఆర్బీఐకి తెలీకుండా ఉండదని అలాంటిది ఇంత పెద్ద మోసం జరుగుతుంటే ఆర్బీఐ ఏం చేస్తోందని ప్రశ్నించింది.
ఈ మేరకు కేంద్రం ఆర్బీఐకి రాసిన లేఖలో నిలదీసింది. పీఎన్బీకి చెందిన ముంబై శాఖలో రూ.11 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణం నేపథ్యంలో పీఎన్బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
కాగా, ఈ కుంభకోణం కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణలో వేగం పెంచింది. ఈ కుంభకోణం నేపథ్యంలో ఆదివారం ఈడీ దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఉన్న జువెలరీ దుకాణాల్లో సోదాలు నిర్వహించింది. కాగా, ఈడీ సూచన మేరకు నీరవ్ మోడీ, చోక్సీల పాస్పోర్ట్లను నాలుగు వారాలపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.