నీరవ్ మోడీ స్కాం 3 రోజుల వడ్డీతో సమానం, భయపడాల్సిన పనిలేదు: బీఎస్ఈ సీఈవో
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ విషయంలో అనవసరంగా భయపడుతున్నారని బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సీఈవో ఆశిష్ చౌహాన్ అన్నారు. నీరవ్ చేసిన మోసం భారతీయ బ్యాంకింగ్ సెక్టార్లో మూడు రోజుల వడ్డీతో సమానం అన్నారు.
అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవ సమావేశంలో ఆశిష్ చౌహాన్ మాట్లాడారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కాం బయటపడినప్పుడే ఆర్బీఐతో పాటు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది అన్నారు.
హాంగ్కాంగ్లో నీరవ్ మోడీ: అరెస్టుపై భారత్కు తేల్చేసిన చైనా
కానీ ఇప్పుడు కళ్లు తెరిచామన్నారు. ఇక ముందు అయినా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ రంగం పరిమాణం రూ.కోటి కోట్లు అని, అప్పు తీసుకున్న వారి నుంచి ఏటా 12 శాతం వడ్డీ తీసుకుంటామని, అదే మన బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే నాలుగు శాతం వడ్డీ ఇస్తామన్నారు.
అంటే వడ్డీల విషయంలో ఎనిమిది శాతం బ్యాంకులకే లాభం అన్నారు. నీరవ్ మోడీ పదేళ్లుగా పీఎన్బీలో మోసాలకు పాల్పడుతున్నారని, ఇందులో భయపడాల్సింది లేదని, మన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ గట్టిదన్నారు.
ఒకవేళ ఏదన్నా జరగకూడనిది జరిగితే మనలను మనం కాపాడుకోవాల్సినంత డబ్బు ఉందన్నారు. ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు బ్యాంకులు వినియోగదారుల నుంచి డబ్బు తీసుకోవాలని చూస్తాయని, నాలుగు శాతం వడ్డీ కాకుండా మూడు శాతం ఇవ్వాలని చూస్తాయన్నారు. కాబట్టి భయాలు అవసరం లేదన్నారు. కాగా, ఈ కేసు విషయంలో నీరవ్ మోడీకి, అతని మామ మెహూల్ ఛోక్సీకి సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.