మదనపల్లె చిన్నారి హత్య కేసులో నేడే తీర్పు, ఉరే సరి అంటోన్న పేరెంట్స్, తీర్పుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధించాలని మహిళా సంఘాలు, బాధితురాలి పేరెంట్స్ ముక్తకంఠంతో కోరుతున్నారు. లారీ క్లీనర్ రఫీపై పోలీసులు పోక్సో, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 17 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు.
పెళ్లి కోసం వెళితే..
బి కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెనికి చెందిన సిద్దారెడ్డి, ఉసారాణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వైష్ణవి, వర్షిణి, వర్షిత అనే కూతుళ్లతో నవంబర్ 7వ తేదీన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో ఓ వివాహానికి హాజరయ్యారు. కేఎన్ఆర్ కల్యాణ మండపానికి తనపేరెంట్స్తో కలిసి ఆరేళ్ల చిన్నారి వర్షిత పెళ్లికి వచ్చింది. రాత్రి 10 గంటల వరకు ఆడుకొన్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆమె కోసం కల్యాణ మండపం మొత్తం వెదికినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పేరెంట్స్ పోలీసులకు సమాచారం అందించారు.
కిడ్నాప్ చేసి..
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అన్ని యాంగిల్లలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో లారీ క్లీనర్ రఫీ చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు కనిపించింది. నిందితుడి కోసం పోలీసు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరునాడు ఫంక్షన్ హాల్ సమీపంలో గల నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి విగతజీవిగా కనిపించింది. చిన్నారిని కిడ్నాప్ చేసి.. లైంగికదాడి చేయడమే గాక హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
జగదల్పూర్లో అరెస్ట్..
చిన్నారిపై లైంగికదాడి చేసింది రఫీ అని పోలీసులు తేల్చారు. చిన్నారి హత్యపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాల నుంచి నిరసనలు మిన్నంటాయి. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు..రఫీ కోసం జల్లెడం పట్టడం ప్రారంభించారు. చిన్నారి హత్య తర్వాత గ్రామంలో లేకపోవడంతో అనుమానం మరింత బలపడింది. మొబైల్ స్విచాప్ చేయడంతో హత్య చేసింది రఫీ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరు బృందాలతో రఫీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి.. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
17 రోజుల్లో చార్జీషీట్..
నవంబర్ 16వ తేదీన రఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో, హత్య కేసులు నమోదు చేసి.. 17 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేశారు. చిన్నారిని హత్య చేసింది రఫీ అని బలమైన ఆధారాలు చార్జీషీట్లో పొందుపరిచారు. అప్పటినుంచి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. వంద రోజుల్లో 41 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. చిన్నారిపై లైంగికదాడి చేసి, హతమార్చాడని ఆధారాలతో సహా నిరూపించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం విచారణ చేపట్టనున్నారు.
వదిలి వెళ్లిపోయిన భార్య
మదనపల్లె మండలం బసినికొండ లారీ క్లీనర్ మహ్మద్ రఫీ స్వస్థలం. రఫీ ప్రవర్తన సరిగా లేదని అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి రఫీ జులాయిగా తిరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా చిన్నారులపై రఫీ రెండుసార్లు లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో జైలుకెళ్లి రెండు నెలలు కూడా ఉన్నాడు. తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.