మరింత విషమించిన వరవర రావు ఆరోగ్యం: రాత్రికి రాత్రి జైలు నుంచి ఆసుపత్రికి: ఫలించిన ఒత్తిళ్లు
ముంబై: తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. నాలుగు రోజుల కిందటే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. జైలులోనే అధికారులు ఆయనకు చికిత్స అందించారు. అయినప్పటికీ.. మెరుగుపడకపోవడంతో ఆయనను ముంబైలోని సర్ జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. వరవర రావు ఆరోగ్యం క్షీణించిందని, మెరుగైన చికిత్సను అందించాలంటూ ఆయన భార్య హేమలత, ప్రొఫెసర్ హరగోపాల్ సహా మానవ హక్కుల ఫోరం నేతలు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
చైనాను నమ్మని భారత్: మళ్లీ సరిహద్దు వివాదాల జోలికి పోకుండా పక్కా ప్లాన్: కాస్సేపట్లో చర్చలు
మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉండటం, భీమా కోరేగావ్ కేసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణల కింద అరెస్టయిన వరవర రావు ప్రస్తుతం ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. 2018లో ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలంటూ మూడు రోజుల కిందటే ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఒత్తిళ్లు తీసుకొచ్చారు.
అదే సమయంలో వరవర రావు ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయనను హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. ఈ విషయాన్ని ఆసుపత్రి డీన్ డాక్టర్ రంజీత్ మంకేశ్వర్ ధృవీకరించారు. తలోజా జైలు అధికారులు వరవర రావును ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఆయనకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. సరిగ్గా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారంటూ మూడు రోజుల కిందటే వరవర రావు భార్య హేమలత ఆందోళనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
తలోజా జైలు అధికారులు తన భర్తతో ఫోనులో మాట్లాడించారని చెప్పారు. తన భర్త మాట తడబడుతోందని, మనుషులను గుర్తు పట్టలేనట్టుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలకృత్యాలను తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారని అన్నారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం అందిన వెంటనే మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు వేగంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్, వీఎస్ కృష్ణ, ఎస్ జీవన్ కుమార్ తదితరులు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై ఏకకాలంలో ఒత్తిళ్లను తీసుకొచ్చారు. మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ లేఖలు రాశారు.