విషం వల్లే సునంద మృతి: పీకల్లోతు చిక్కుల్లో థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెసు నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ విషప్రయోగం వల్లనే మరణించిందని, ఆమెది సహజమరణం కాదని ఢిల్లీ పోలీసులు తేల్చారు. దీంతో శశి థరూర్ మరిన్ని కష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంది. సునంద పుష్కర్ మృతిపై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తాజా నివేదికను తయారు చేశారు.
నివేదికలోని అంశాలను ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ శనివారంనాడు వెల్లడించారు. 2014 జనవరిలో సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతికి గల కరాణలాను తెలుసుకునేందుకు నమూనాలను వాషింగ్టన్లోని ఎఫ్బిఐకి పంపించారు.
ఎఫ్బిఐ పంపిన నివేదికను ఎయిమ్స్ వైద్యులు పరిశీలించి తాజా నివేదికను రూపొందించి దాన్ని ఢిల్లీ పోలీసులకు సమర్పించారు. సునంద దేహంలో రేడియో యాక్టివ్ పదార్థాలు ఏవీ లేవని బస్సీ స్పష్టం చేశారు. అయితే, ఆమె ఏ విధమైన విషం వల్ల మరణించిందనేది ఇంకా తేలాల్సి ఉంది.
సునంద పుష్కర్ ప్లీహం, కాలేయం, కడుపు, కడ్నీ, మూత్రనాళాల్లో ఒకే రకమైన విషపదార్థం కనిపించిందని, దానివల్లనే ఆమె మరణించిందని ఎఫిఐ తన నివేదికలో చెప్పింది. ప్రమాదకరమైన రసాయనం వల్ల ఆమె మరణించిందని, దాన్ని నోటీ ద్వారా అందించడమో ఇంజక్షన్ ద్వారా ఇవ్వడమో చేశారని అభిప్రాయపడింది.
తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ప్రశ్నించేందుకు శశి థరూర్కు దర్యాప్తు అధికారులు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త విషయాల వెలుగులో ఆయనను ప్రశ్నించడానికి దర్యాప్తు అధికారులు సిద్ధపడుతున్నారు.