పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నాయంటూ ఆర్మీ
న్యూఢిల్లీ: పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలను పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని భారత రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) వాస్తవానికి పాకిస్థాన్ నియంత్రణలో లేదని, ఇప్పుడు అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు.
గిల్గిత్ బాల్టిస్థాన్, పీవోకే ప్రాంతాలను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్ రాష్ట్రమని, కానీ, ఆ రెండు ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకుందని బిపిన్ రావత్ తెలిపారు. ప్రస్తుతం పీవోకే ఉగ్రవాదుల నియంత్రణలోనే ఉందన్నారు.
ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక ప్రొవిజన్ మాత్రమేనని అన్నారు. దీన్ని తీసుకొచ్చినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, దీన్ని తొలగించినప్పుడు మాత్రం పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. జమ్మూకాశ్మీర్లో సాధారణ పరిస్థితిని దెబ్బతీసేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన తుపాకులు అమెరికా నుంచి త్వరలోనే భారత రక్షణ దళాలకు చేరుతాయని బిపిన్ రావత్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అనేది భారతదేశంలో ఆ రాష్ట్రాన్ని సంపూర్ణంగా విలీనం చేసేందుకు సహాయపడుతుందని అన్నారు.
ఇది ఇలావుంటే, ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లే జమ్మూకాశ్మీర్లో స్థానికంగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా ప్రాంతీయ అభివృద్ధి మండలి(బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 98.3శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్, లేహ్, లడఖ్లో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎన్నికలు జరిగాయి. 310 బ్లాకుల్లో 1090 మంది విద్యార్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 98శాతం పోలింగ్ నమోదైంది. అంతేగాక, ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.