ఛేజ్ చేసి నకిలీ నిర్మాత పట్టివేత: నటి ఐశ్వర్య వెల్లడి
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్లో సినీ ఫక్కీలో వెంటాడి, వేటాడి ఓ నకిలీ నిర్మాతను పోలీసులు పట్టుకున్నారు. సినిమాలో హీరోయిన్ వేషం ఇప్పిస్తానని నమ్మించి ఓ నటిని అతను మోసం చేశాడు. ఈ సంఘటన వివరాలను నటి ఐశ్వర్య మీడియాకు వివరించారు. ఈశ్వర్ అనే 32 ఏళ్ల వ్యక్తి తాను నిర్మాతనంటూ రెండు నెలల క్రితం తన దగ్గరకు వచ్చాడని, ఓ సినిమాలో హీరోయిన్ వేషం ఇప్పిస్తానని చెప్పాడని ఆమె చెప్పారు.
అందుకు అతను ప్రతిఫలం అడిగాడని, ముందు ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవానలి చెప్పి పది వేల రూపాయలు అడిగాడని, తన వద్ద ఇప్పుడంత డబ్బు లేదని, తర్వాత ఇస్తానంటూ అక్కడి నుంచి వచ్చేశానని ఆమె చెప్పారు. తర్వాత ఆ సంగతి తన స్నేహితులకు చెప్పి అతనితో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు ఆమె తెలిపారు.
గురువారంనాడు రమ్య అనే తన స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చిందని, ఆ ఆశ్వర్తో కాఫీ షాపులో ఉన్నానని చెప్పిందని, హీరోయిన్ వేషం ఇప్పిస్తానని పది వేల రూపాయలు అడుగుతున్నాడని చెప్పిందని ఐశ్వర్య చెప్పారు. అతనితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలని తాను రమ్యకు సూచించానని, వెంటనే తన స్నేహితురాలు నయనను, మరో నటుడిని కూడా తీసుకుని అక్కడికి చేరేసరికి ఈశ్వర్ అక్కడి నుంచి పారిపోవడానికి పరుగు అందుకున్నాడని ఆమె వివరించారు.
తాము అతని వెంట పడ్డామని, దొంగ దొంగ అంటూ అరిచామని, స్పందించిన ప్రజల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించామని ఐశ్వర్య చెప్పారు. ఐశ్వర్య, వర్ధమాన నటి నయనలతో పాటు ముద్దు మనసే హీరో అరుణ్ గౌడ కూడా కాఫీ షాపునకు చేరుకుని ఈశ్వర్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు.