నిజాం మ్యూజియం దోపిడీ కేసు: బంగారు వస్తువులను లూటీ చేసిన వ్యక్తి అరెస్టు..వస్తువులు స్వాధీనం
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం నిజాం మ్యూజియం నుంచి ప్రాచీన వస్తువులు, బంగారు టిఫిన్ బాక్సులు దొంగతనం చేసిన దొంగలను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వారిదగ్గర నుంచి దొంగలించబడ్డ వస్తువులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటి ఏడవ నిజాంకు చెందిన ఒక బంగారపు టిఫిన్ బాక్స్, వజ్రవైఢూర్యాలు ,రత్నాలతో పొదగబడినటువంటి కప్పులు, సాసర్లు, స్పూన్లును దొంగల దోచుకెళ్లారు. హైదరాబాద్లో దోచుకున్న సొమ్ముతో ముంబైకి పారిపోయారు. అక్కడ వారు ఓ విలాసవంతమైన హోటల్లో గది తీసుకుని గడిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ధూమ్ 2 తరహాలో.. నిజాం మ్యూజియంలో భారీ చోరీ
దొంగలను పట్టుకునేందకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారికోసం వేట ప్రారంభించారు. బంగారంతో చేసిన టిఫిన్ బాక్సులో దొంగలు రోజూ భోజనం చేసేవారని పోలీసులు తెలిపారు. వారు దోచుకున్న అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 2న దొంగతనం జరిగిందని వీరిని పట్టుకునేందుకు 15 బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నట్లు వారు వెల్లడించారు.
దొంగతనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఇద్దరు దుండగులు ముఖాలకు ముసుగు ధరించినట్లు కనిపించింది. దొంగతనం చేసి భవంతి నుంచి బయటకు వచ్చి బైకుపై పారిపోవటం దృశ్యాల్లో కనిపించాయి. వెంటిలేటర్ నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు ఆపై దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఎంతో చారిత్రక ఘనత ఉన్న ఆ వస్తువులను దొంగలించిన వారిని పట్టుకుని వస్తువులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఏడవ నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలిఖాన్ గతవారమే పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఈ మ్యూజియంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్కు సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు డిస్ల్పేలో ఉంచిన చాలా మటుకు వస్తువులు నిజాం నవాబుకు చెందినవే అని వాటిని వజ్రాలు, రత్నాలతో తయారు చేశారని చెప్పారు.