ఖాకీల మానవత్వం: గాయపడిన మావోయిస్టును చికిత్స కోసం మోసుకెళ్లిన పోలీసులు
ఛత్తీస్గఢ్:ఛత్తీస్గఢ్ దంతెవాడలో గాయపడిన ఓ మావోయిస్టును చికిత్స కోసం అడవుల నుంచి దాదాపు 12 కిలోమీటర్ల మేరా పోలీసులు మోసుకెళ్లారు. మద్కం హిద్మా అనే మావోయిస్టు కమాండర్ తలపై రూ.5 లక్షలు ప్రభుత్వం బహుమానం ప్రకటించింది. హిద్మా పేలుడు పదార్థాలు పెడుతుండగా భద్రతా దళాల కోసం మావోలు ఏర్పాటు చేసిన వలలోనే పడి చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు.
భద్రతా బలగాల కోసం ఏర్పాటు చేసిన వలలో తనే పడిపోయి తీవ్రంగా గాయపడిన మావోయిస్టును చికిత్స కోసం 12 కిలోమీటర్ల మేరా ఓ మంచంపై పోలీసులు తీసుకెళ్లడం నిజంగా హర్షించదగ్గ విషయమని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు. అడవిలో పడిపోగానే ఓ గ్రామంలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు ... 35 మంది కానిస్టేబుళ్లు వెళ్లి హిద్మాను మెరుగైన చికిత్స కోసం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. నదులు, కొండప్రాంతాలు దాటుకుంటూ మావోయిస్టును జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. హిద్మా కాలుకు ఇన్ఫెక్షన్ సోకిందని అది ఆలస్యమై ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదంగా మారేదని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు. ఎస్పీ అభిషేక్ పల్లవ స్వతహాగా డాక్టరు కావడం విశేషం.
మలాన్గిర్ ఏరియా కమిటి సభ్యుడిగా ఉన్న హిద్మా 10 కేసుల్లో ప్రధాన నిందితుడిగా న్నాడు. సుకుమా, దంతెవాడ జిల్లాలతో పాటు బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులు చేసిన కేసులో హిద్మా ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. నాగర్గుడా మరోకి గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో హిద్మా గాయపడినట్లు అభిషేక్ పల్లవ చెప్పారు. అయితే నాటు మందులు తీసుకుంటూ చికిత్స పొందుతున్నాడని ఎస్పీ వివరించారు. అప్పటికే ఇన్ఫెక్షన్ తన శరీరమంతా పాకిందని చెప్పారు.
ముందుగా మావోయిస్టులు కూడా భారత పౌరులే అన్న విషయాన్ని గుర్తించాలని చెప్పిన ఎస్పీ... తను ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని చెప్పారు. ఒక భారత పౌరుడిగా వైద్యపరమైన చికిత్స తను పొందే హక్కు ఉందని చెప్పారు. రెండవదిగా పోలీసులు గ్రామస్తులను కాపాడుతారనే సంకేతాలు వెళతాయని చెప్పారు. మూడవదిగా హిద్మా పోలీసు శాఖలో చేరితే భవిష్యత్తులో నక్సల్ ఆపరేషన్స్కు పనికొస్తాడని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు.