హత్రాస్ మత మార్పిడి... బిగ్ ట్విస్ట్... భారీగా మోహరించిన పోలీసులు... అసలేం జరుగుతోంది...
కుల వివక్ష నుంచి బయటపడేందుకు ఆనాడు అంబేడ్కర్ అనుసరించిన బౌద్ద మార్గం బాటలోనే ఇప్పటికీ ఎంతోమంది నడుస్తున్నారు. ఇటీవల హత్రాస్ దళిత(వాల్మీకి) యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో కరెరా గ్రామానికి చెందిన దాదాపు 236 మంది వాల్మీకి కులస్తులు బౌద్ద మతాన్ని స్వీకరించారు. అంబేడ్కర్ మనవడు రాజారత్నం సమక్షంలో వీరంతా బౌద్దంలోకి మారారు. అయితే మతం మారిన నాటి నుంచి తమను పోలీసులు వేధిస్తున్నారని ఆ వాల్మీకి కులస్తులు ఆరోపిస్తుండటం గమనార్హం. కెమెరాల ముందుకొచ్చి... మతం మారలేదని చెప్పాలంటూ పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆ రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి...
పోలీసుల వేధింపులపై పవన్(27) అనే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ... 'మంగళవారం(అక్టోబర్ 20) రాత్రి పోలీసులు నన్ను బలవంతంగా ఘజియాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. రాజారత్న అంబేడ్కర్ తమను కలిసిన రోజు.. అక్కడ మత మార్పిడి కార్యక్రమం ఏదీ చోటు చేసుకోలేదని చెప్పాలంటూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్,పోలీసులు కలిసి నాపై ఒత్తిడి తెచ్చారు. మతం మారినట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని,వట్టి వదంతులని చెప్పమంటూ నన్ను ఒత్తిడికి గురిచేశారు.' అని తెలిపారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చేందుకు తాను నిరాకరించానని పవన్ చెప్పారు. తనతో పాటు మతం మారిన తన సామాజికవర్గమంతా ఆరోజు తనతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చారని... వాళ్ల వల్లే తాను అక్కడినుంచి బయటపడ్డానని చెప్పారు.
ఇప్పటికీ అదే ఒత్తిడి...
ఇప్పటికీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్తో పాటు స్థానిక కౌన్సిలర్.. వారిని కలవాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారని పవన్ ఆరోపించారు. ఎందుకు వాళ్లిలా తనను కలవమని తరుచూ అడుగుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రస్తుతం తాను చాలా అభద్రత భావంలో ఉన్నానని చెప్పారు. మరోవైపు సైదాబాద్ పోలీసులు మాత్రం పవన్ ఆరోపణలను ఖండించారు. కేవలం వారి భద్రత కోసం గ్రామంలో పోలీసులను మోహరించామని... అంతే తప్ప ఎవరినీ ఏ విషయంలో ఒత్తిడి చేయట్లేదని చెప్పారు.
మత మార్పిడి... ఎఫ్ఐఆర్...
మత మార్పిడి వార్తలు గ్రామంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వ్యాప్తి చేసిన ఒక పుకారు అని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. మోంటు వాల్మీకి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికైతే ఎవరినీ అరెస్ట్ చేయలేదని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. అయితే కరెరా గ్రామంలో అసలు మోంటు వాల్మీకి అనే వ్యక్తే లేడని అక్కడి వాల్మీకి సామాజికవర్గం వారు చెబుతుండటం గమనార్హం. మరోవైపు స్థానిక కౌన్సిలర్ విజేంద్ర చౌహాన్ మాట్లాడుతూ.. కరెరా గ్రామంలో తాను ఇంటింటికీ తిరిగానని... మతం మారినట్లు ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
తాము మతం మారినట్లు ఎప్పుడైతే వార్త బయటకొచ్చిందో అప్పటినుంచి భారీ ఎత్తున పోలీసులు గ్రామంలో మోహరించబడ్డారని కరెరా గ్రామానికి చెందిన వాల్మీకి వర్గం చెబుతోంది. గ్రామంలో ఇంకెవరూ మత మార్పిడికి పాల్పడకుండా నిరోధించేందుకు ఇలా పోలీసులను మోహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం... మతం మారినవారి భద్రత కోసమే అధికారులు తమను అక్కడ మోహరించారని చెబుతున్నారు.
ఇటీవలే బౌద్దంలోకి...
ఇటీవలి హత్రాస్ ఘటనలో వాల్మీకి యువతిపై ఉన్నత కులాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడగా... ఈ కేసును డీల్ చేసే విషయంలో పోలీసులు,అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దళిత యువతి అన్న చిన్నచూపుతోనే పోలీసులు,అధికార యంత్రాంగం ఆ కుటుంబాన్ని సైతం అనుమతించకుండా రాత్రికే రాత్రే హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో దళిత కుటుంబానికి ఎదురైన వివక్షతో పాటు తమ గ్రామంలోని చౌహాన్ సామాజిక వర్గం తమపై ప్రదర్శిస్తున్న వివక్ష కారణంగా తామంతా బౌద్దంలోకి మారినట్లు కరెరా గ్రామానికి చెందిన వాల్మీకి సామాజికవర్గం చెబుతోంది.