Sabarimala:పోలీసులకు చేదువార్త చెప్పిన ప్రభుత్వం... ఏమిటంటే..?
మరికొన్ని రోజుల్లో శబరిమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ట్రావెన్కోర్ దేవసం బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శబరిమలలో ఈ సారి స్వామివారి దర్శనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుండగా... అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా రోజుకు వెయ్యిమంది కంటే భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వారాంతంలో అయితే రెండు వేల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతిస్తోంది.
అన్నివయస్సుల మహిళలు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వడంతో గతంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంతమంది మహిళలు కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నించగా కొన్ని హిందూ సంఘాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో ఈ సారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే ఆలయం లోపల ఆలయం వెలుపల గట్టి భద్రతను ఇస్తున్న పోలీసుల పరిస్థితి అంతబాగోలేదు. గతంలో పోలీసులకు ఉచితంగా భోజనం పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పోలీసులు తమ భోజన ఏర్పాట్లను వారే చూసుకోవాలని పేర్కొంది. దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియక వారంతా సొంత డబ్బులు వేసుకుని తమ భోజన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అంతా కొంత మొత్తంలో డబ్బులు వేసుకుని మెస్ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు.
నిళక్కల్, పంపా, సన్నిధానంలో పోలీసులు గస్తీ చేపట్టారు. కొన్నేళ్లుగా మండల-మకరవిలక్ సమయంలో పోలీసులకు ఉచితంగా మూడు పూట్ల అంటే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టేవారు. పోలీసుల భోజనం అయ్యే ఖర్చును డీజీపీకి ప్రభుత్వం బదిలీ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఎవరి భోజనం వారే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకు చెప్పింది.
2011 నుంచి ప్రభుత్వమే కొండపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చింది. తొలి ఏడాది పోలీసుల భోజనం కోసం రూ.75 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పోలీసుల భోజనంకు అయ్యే ఖర్చు కేటాయింపులు పెంచుతూ వస్తోంది. ఈ సారి కరోనా కారణంగా ఆంక్షలు అమల్లోకి రావడంతో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడంతో వారి భోజనాలకు అయ్యే ఖర్చును విడుదల చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సారి విధుల్లో 350 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు.