Citizenship Act: జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ: నిరసనలు, విధ్వంసం: పోలీసుల లాఠీఛార్జీ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సీటీ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలకు దిగిన పలువురు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేశారు. యూనివర్సిటీలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులు
ఆదివారం సాయంత్రం విద్యార్థులు, పోలీసులు మధ్య ఘర్ణణ వాతావరణం ఏర్పడింది.ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయు గోళాలను ప్రయోగించారు.
ఘర్షణ వాతావరణం
విద్యార్థులకు కూడా పోలీసులపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో కొంత మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆందోళన చేపట్టేందుకు నిరసనకారులు సిద్ధమయ్యారు.
తనపై దౌర్జన్యం చేశారంటూ బీబీసీ జర్నలిస్టు
కాగా, నిరసనలను కవర్ చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని బీబీసీ జర్నలిస్టు బుస్రా షేక్ ఆరోపించారు. మగ పోలీసులు తనను జుట్టు పట్టి లాగారని, తన ఫోన్ను లాక్కున్నారని ఆరోపించారు. ఫోన్ ఇవ్వమంటే తనను దుర్భాషలాడారని ఆమె చెప్పారు. తాను తమాషా కోసం ఇక్కడికి రాలేదని, విద్యార్థుల నిరసనను కవర్ చేసేందుకు వచ్చానని ఆమె తెలిపారు.
బస్సులను తగలబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు
కాగా, దక్షిణ ఢిల్లీలో పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మూడు బస్సులను తగలబెట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన ఫైరింజన్లపైనా ఆందోళకారులు దాడులు చేశారు. కాగా, ఓ బస్సును ప్రయాణికులు పూర్తిగా దిగక ముందే ఆందోళనకారులు నిప్పుపెట్టడం గమనార్హం. అయితే, పూర్తిగా మంటలు అంటుకునేలోగా ప్రయాణికులు బయటికి పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాల్పులు జరపారంటూ తప్పుదోవ పట్టించడంపై డీసీపీ ఆగ్రహం
మరోవైపు విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపారంటూ కొందరు తప్పుడు ప్రచారాలు చేయడంపై ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ చిన్మయ్ బిస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
విధ్వంసం వద్దంటూ ఢిల్లీ సీఎం..
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకారులు సంయమనం పాటించాలని, విధ్వంసానికి పాల్పడవద్దని సూచించారు. విధ్వంసానికి దిగిన నిందితులను పట్టుకుని శిక్షిస్తామని అన్నారు. లెఫ్ట్నెంట్ గవర్నర్ కూడా పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. విధ్వంస ఘటనల నేపథ్యంలో సోమవారం సౌత్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు.