ఆ దాడి జాతి వివక్ష వల్లే, సమాచారం ఇస్తే 6వేల డాలర్లు: అమెరికా
వాషింగ్టన్ స్టేట్లో ఇటీవల దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తిపై జరిగిన దాడి జాతి వివక్ష వల్లే జరిగిందని నిర్ధారించారు. నిందితుడి పక్కా ఆధారాలు ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని పోలీసులు, ఎఫ్బీఐ ప్రకటించింద
వాషింగ్టన్: వాషింగ్టన్ స్టేట్లో ఇటీవల దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తిపై జరిగిన దాడి జాతి వివక్ష వల్లే జరిగిందని నిర్ధారించారు. నిందితుడి పక్కా ఆధారాలు ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని పోలీసులు, ఎఫ్బీఐ ప్రకటించింది.
ఇటీవల కెంట్లో దీప్రాయ్ తన ఇంటి బయట ఉండగా ముసుగు ధరించిన వ్యక్తి 'మీ దేశానికి వెళ్లిపోండి' అని అరుస్తూ కాల్పులు జరపడంతో అతను గాయపడిన విషయం తెలిసిందే. ముసుగు వేసుకున్న వ్యక్తి తొలుత దీప్ రాయ్తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చాడు. దీంతో ఆయన చేతికి గాయమైంది.
కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియరాలేదు. దీంతో ఈ కేసుకు సంబంధించి సమాచారం అందించిన వారికి ఆరు వేల డాలర్ల రివార్డు ఇస్తామని ప్రకటించారు.
నీ దేశం వెళ్లిపో: మాస్క్తో వచ్చి సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు
ఈ ఘటనను విద్వేషపూరిత నేరంగా పరిగణిస్తూ కెంట్ పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నమూనా స్కెచ్ను కూడా పోలీసులు విడుదల చేశారు.
తన జాతి వల్లే దుండగుడు తనను లక్ష్యంగా చేసుకున్నాడని దీప్ రాయ్ తెలిపినట్లు కెంట్ పోలీసులు చెప్పారు. విద్వేష నేరాలను సహించబోమన్నారు.
దీప్ రాయ్ తలపాగా ధరించి ఉన్నారని, ఘటన జరిగిన సమయంలో పరిస్థితులను చూస్తే జాతివివక్షే కాల్పులకు కారణమై ఉంటుందని భావిస్తున్నామని, దర్యాఫ్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడి స్కెచ్ విడుదల చేశారు.