మళ్లీ ఎర్రచందనం కలకలం: యథేచ్ఛగా అక్రమ తరలింపు: స్మగ్లర్లపై పోలీసుల కాల్పులు
బెంగళూరు: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఎర్రచందనానికి ఆలవాలమైన శేషాచలం అడవుల నుంచి యథేచ్ఛగా వాటిని తరలిస్తున్నారు స్మగర్లు. చాలాకాలం పాటు స్తబ్దుగా ఉంటూ వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు తరలించిన 300 కేజీల ఎర్రచందనం దుంగలను కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం పుట్టిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు స్మగర్లపై ఎదురు కాల్పులు జరపడం సంచలనంగా మారింది.
మళ్ళీ రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు .. శేషాచల అడవుల్లో పోలీసులపై రాళ్ళు రువ్వి పరారీ
జావేద్ షేక్, ఇమ్రాన్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు స్కార్పియో వాహనంలో సుమారు 300 కేజీల ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించారు. వాటిని బెంగళూరు రూరల్ జిల్లా హొస్కోటే పరిధిలోని కట్టిగెన హళ్లిలో నిల్వ ఉంచారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో బెంగళూరు క్రైమ్ డీఎస్పీ నింగప్ప నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. పోలీసులు దాడి చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న జావేద్ షేక్, ఇమ్రాన్ పాషా తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై వారు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ప్రసన్న అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు చేయడంతో వారు లొంగిపోయారు. చిత్తూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను తీసుకొస్తున్నట్లు వారు నిందితులు అంగీకరించినట్లు నింగప్ప తెలిపారు. ఎర్రచందనం దుంగలతో పాటు స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో విస్తరించిన శేషాచలం అడవుల నుంచే నిందితులు ఎర్రచందనం దుంగలను తీసుకొచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. దాన్ని ఎవరికి విక్రయించడానికి తీసుకొచ్చారు? ఎందుకు తరలించారు? అనే విషయంపై ఇంకా ఆరా తీయాల్సి ఉందని తెలిపారు.