పోలీసులు నన్ను బెదిరించారు, హింసించారు: శ్రీశాంత్
న్యూఢిల్లీ: పోలీసులు తనను బెదిరించి, తన పైన ఒత్తిడి తెచ్చి నేరాన్ని ఒప్పించాలని కేరళ పేసర్ శ్రీశాంత్ సోమవారం చెప్పాడు. ఢిల్లీ పోలీసులు ఒత్తిడి చేయడం వల్లనే తాను నేరాన్ని అంగీకరించానని చెప్పాడు. ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ నేరంపై అరెస్టయి, ఆ తర్వాత బెయల్ పొందిన శ్రీశాంత్ తాను నిర్దోషినని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీకి సమర్పించిన లేఖలో స్పష్టం చేశాడు.
బుకీలకు సమాచారం ఇవ్వడానికే తాను రుమాలును ప్యాంట్లో చెక్కుకున్నానని మీడియలో వచ్చిన వార్తలను అతను ఖండించాడు. రుమాలుతో బంతిని తుడవడం, అది కింద పడకుండా ప్యాంట్లోకి చెక్కుకోవడం క్రికెట్ లో కొత్తేమీ కాదన్నాడు. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు తనను మానసికంగా, శారీరకంగా వేధించారని, గతంతరం లేని పరిస్థితుల్లో వారి ముందు నేరం చేసినట్టు అంగీకరించానని ఆ లేఖలో శ్రీశాంత్ వివరించాడు.
తన కుటుంబ సభ్యులను కూడా పోలీస్ అధికారులు వేధిస్తారన్న భయం తనను వెంటాడిందని చెప్పాడు. తాను బుకీలతో జరిపిన సంభాషణను రికార్డు చేసినట్టు చెప్తున్న ఢిల్లీ స్పెషల్ వద్ద అసలు ఆధారాలే లేవని పేర్కొన్నాడు. మీడియాలో వచ్చిన కథనాలకు అభూత కల్పలను జోడించి ఢిల్లీ పోలీస్ అధికారులు తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించాడు.
మానసిక, శారీరక వేధింపులను భరించలేక వారి ముందు నేరం చేసి నట్టు అంగీకరించానని అన్నాడు. నిజానికి తనకు స్పాట్ ఫిక్సింగ్తో ఎలాంటి సంబంధం లేదని శ్రీశాంత్ తన లేఖలో పేర్కొన్నాడు. న్యాయస్థానాలపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపాడు. కాగా, శ్రీశాంత్పై బిసిసిఐ జీవితకాల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే.