అక్కాచెల్లెళ్ల ఫిర్యాదు: ఆశారాం, కొడుకులపై రేప్ కేసు
గాంధీనగర్: వివాదాస్పద ఆశారాం బాపు పైన మరో అత్యాచారం కేసు నమోదైంది. ఆశారాం, అతని తనయుడు నారాయణ సాయిలు తమ పైన అత్యాచారం చేసినట్లు సూరత్కు చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఒక యువతి ఆశారాం తన పైన అత్యాచారం చేసినట్లు ఆరోపించగా, మరో యువతి అతని కొడుకు నారాయణ సాయి అత్యాచారం చేసినట్లుగా ఆరోపించింది. అహ్మదాబాదు శివారులోని ఆశ్రమంలో ఉండగా ఆశారాం తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. 1997 నుండి 2006 వరకు అత్యాచారం చేసినట్లు అక్క, తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ సాయి 2002-2005 మధ్య కాలంలో అత్యాచారం చేసినట్లు చెల్లెలు ఆరోపించింది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆశారాంను మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. నారాయణ సాయి ఎక్కడున్నది తెలియరాలేదు. అయితే అతను ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.
కాగా, సూరత్ అత్యాచారం కేసులో స్థానిక కోర్టు ఆశారాం బాపును పోలీసుల కస్టడీకి అప్పగించింది. అక్టోబర్ 19వ తేది వరకు కస్టడీ ఇచ్చింది.