లాక్ డౌన్ వేళ దారుణం.. 13 ఏళ్ల బాలికపై ఆరుగురి గ్యాంగ్ రేప్..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలిక(13)పై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా.. మరో నలుగురు తమ సెల్ఫోన్స్లో దాన్ని చిత్రీకరించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు గుర్తించారు.
సీతాపూర్ ఎస్పీ ఎల్ఆర్ కుమార్ మాట్లాడుతూ.. ఆ బాలిక ఇంటికి వెళ్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు అడ్డగించినట్టు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా.. మిగిలిన నలుగురు సెల్ఫోన్లో దాన్ని చిత్రీకరించినట్టు చెప్పారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించామన్నారు. స్వల్ప గాయాలు మినహా ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్స్ 376-D,120B,506లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
బుధవారం మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో బాలిక పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె కళ్లు,ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం జబల్పూర్లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.