బుర్ఖా విప్పి మరీ మర్మాంగాలపై కొట్టారు.. : పోలీసులపై జామియా మహిళా విద్యార్థినులు
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని అరెస్ట్ చేసి బలవంతంగా అక్కడినుంచి తరలించారు. అయితే ఈ క్రమంలో పోలీసులు తమ మర్మాంగాలపై దాడి చేశారని పలువురు వర్సిటీ మహిళా విద్యార్థులు ఆరోపిస్తుండటం సంచలనం రేకెత్తిస్తోంది.
10మంది మహిళలకు గాయాలు..
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు తమ ప్రైవేట్ పార్ట్స్కి గాయాలు కావడంతో జామియా హెల్త్ సెంటర్లో చేరారు. అయితే కొంతమంది విద్యార్థులకు గాయాలకు తీవ్రంగా ఉండటంతో... అక్కడినుంచి అల్ షిఫా ఆస్పత్రికి తరలించినట్టు జామియా హెల్త్ సెంటర్ వైద్యులు తెలిపారు. 10 మందికి పైగా మహిళా విద్యార్థుల మర్మాంగాలపై గాయాలు గుర్తించామన్నారు.
బుర్ఖా విప్పి మరీ కొట్టారని ఆరోపణలు..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా విద్యార్థుల్లో ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడారు. ఓ మహిళా పోలీస్ తన బుర్ఖా విప్పి మరీ ప్రైవేట్ పార్ట్స్పై బూటు కాలితో దాడి చేసిందని చెప్పారు. లాఠీతోనూ తన ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేసిందన్నారు.మరో ఇద్దరు పురుష విద్యార్థులు కూడా తమ మర్మాంగాలపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. గాయాలతో వారు కూడా ఆస్పత్రిలో చేరారు. పోలీసులు లాఠీలతో ఛాతిపై కొట్టడంతో కొంతమంది విద్యార్థులకు అంతర్గతంగా గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.
బెల్టు కింది భాగంలో కొట్టారని ఆరోపణలు..
మరో విద్యార్థి మాట్లాడుతూ.. పోలీసులు తమ బెల్టు కింది భాగంలోనే ఎక్కువగా కొట్టారని ఆరోపించారు. కెమెరా కంటికి చిక్కకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బెల్టు కింది భాగంలో దాడి చేశారని అన్నారు. తమను నాలుగైదు సార్లు గట్టిగా వెనక్కి నెట్టేశారని.. దాంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చాలామంది మహిళల ప్రైవేట్ పార్ట్స్కు గాయాలయ్యాయని.. తనకు మోచేయి,పొత్తి కడుపు భాగంలో గాయాలయ్యాయని వాపోయారు.
స్పృహ కోల్పోయానన్న విద్యార్థి
పోలీసులు మహిళా విద్యార్థులపై దాడి చేస్తుంటే.. తాను అడ్డుకున్నానని,దాంతో తన ఛాతిపై,వెనక భాగంపై పోలీసులు లాఠీతో కొట్టారని సదరు విద్యార్థి వాపోయారు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. శాంతియుత నిరసనకు తమను అనుమతించాలని పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. మాటి మాటికీ వెనక్కి నెట్టేయడంతో.. తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తి తాను రెండుసార్లు స్పృహ కోల్పోయినట్టు చెప్పారు.
సీఏఏని వ్యతిరేకిస్తూ ర్యాలీ..
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు సీఏఏని వ్యతిరేకిస్తూ పార్లమెంటు వరకు ర్యాలీ చేపట్టాలని బయలుదేరారు. అయితే పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు బారికేడ్ల పైనుంచి దూకే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళా విద్యార్థులు అని కూడా చూడకుండా తమ మర్మాంగాలపై లాఠీలతో కొట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసుల వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు.