బైకు ఆపలేదని లాఠీ విసిరిన పోలీసు... కంట్రోల్ తప్పి కారును ఢీకొన్న యువకుడు
కొల్లాం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. బైకు నడుపుతున్న ఓ వ్యక్తిపై పోలీసు లాఠీ విసరడంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ప్రాణాలతో బయటపడ్డ సిద్ధిఖ్
ఇదిగో ఇక్కడ ఫోటోలో స్ట్రెచర్పై కనిపిస్తున్న వ్యక్తి పేరు సిద్ధిఖ్. 22 ఏళ్ల యువకుడు. తీవ్రగాయాలతో కనిపిస్తున్నాడు. తలకు బలమైన గాయం, బ్యాండేజ్ నుంచి రక్తస్రావం, కాలు విరిగినట్లుగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మాత్రం ఏదో రోడ్డు ప్రమాదంలా ఉన్నట్లుంది కదూ. ఇది యాక్సిడెంటే.. అయినప్పటికీ ఏదో పొరపాటు వల్ల జరిగినది కాదు. ఓ పోలీసు వ్యవహారంతో సిద్ధిఖ్ ఇలా ప్రాణాలతో బయటపడ్డాడు.
బైకు ఆపకుండా వెళ్లడంతో లాఠీ విసిరిన పోలీసు
కేరళలోని కొల్లాంలో నివసించే సిద్ధిఖ్ గురువారం ఉదయం ఇంటి నుంచి తన బైకుపై బయటకు బయలు దేరాడు. అయితే ఇంటికి రావడం మాత్రం ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో వస్తానని ఊహించిఉండడు. దీనంతటికీ కారణం ఓ సివిల్ పోలీస్ చంద్రమోహన్. డ్యూటీ పై ఉన్న చంద్రమోహన్ వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా సిద్ధిఖ్ వచ్చాడు. తనను ఆగాల్సిందిగా కోరాడు. కానీ పోలీసులు కదా.. భయంతో సిద్ధిఖ్ అలానే ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు. బండి ఆపకుండా పోవడంతో ఆగ్రహం చెందిన పోలీస్ చంద్రమోహన్ వెంటనే తన చేతిలో ఉన్న లాఠీని సిద్ధిఖ్ వైపు బలంగా విసిరాడు.
కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న సిద్ధిఖ్
సిద్ధిఖ్ వెనక లాఠీ బలంగా తగలడంతో బైక్పై కంట్రోల్ తప్పాడు. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సిద్ధిఖ్ తలకు బలమైన గాయాలయ్యాయి. రక్తమోడుతున్న సిద్ధిఖ్ని దగ్గరలోని తాలుకా హాస్పిటల్లో పోలీసులు తన కొడుకుని అడ్మిట్ చేసి వెళ్లిపోయారని సిద్ధిఖ్ తండ్రి చెప్పాడు. రోడ్డు ప్రమాదం గురించి ఆస్పత్రి వర్గాలు తమకు సమాచారం ఇచ్చాయని చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై ఆరా తీసిన కేరళ డీజీపీ లోక్నాథ్ బెహ్రా.. పోలీస్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కొల్లాం ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు.
పోలీసును సస్పెండ్ చేసిన ఎస్పీ
డీజీపీ ఆదేశాల మేరకు చంద్రమోహన్ను సస్పెండ్ చేసినట్లు కొల్లాం ఎస్పీ హరిశంకర్ చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పిన ఎస్పీ హరిశంకర్... దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డీఎస్పీ ర్యాంక్ ఉన్న అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హరిశంకర్ తెలిపారు. అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం చంద్రమోహన్ లాఠీ విసరడంతోనే సిద్ధిఖ్ బైకుపై కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడని చెప్పినట్లు చెప్పారు. చంద్రమోహన్పై వేటు వేయడంతో పాటు అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న ఇతర పోలీసులను బదిలీ చేశామని వెల్లడించారు. రద్దీగా ఉన్న రోడ్లపై పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న పద్ధతిపై ఈ మధ్యే కేరళ హైకోర్టు సీరియస్ అయ్యింది.