ఉగ్రవాది భత్కల్ విడుదలకు సిఎం కేజ్రీవాల్ కిడ్నాప్?
న్యూఢిల్లీ: ఉగ్రవాది యాసిన్ భత్కల్ను విడిపించుకోవడానికి ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిడ్నాప్కు కుట్ర పన్నుతోందని పోలీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు జెడ్ కేటగిరీ భద్రతను తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్కు అపహరణ ముప్పుందని నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
రాజకీయాల్లో విఐపి సంస్కృతికి స్వస్తి చెప్పాలన్న తమ ఆమ్ ఆద్మీ పార్టీ విధానానికి అనుగుణంగా సెక్యూరిటీని తీసుకోవడానికి కేజ్రివాల్ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. 2010 ఏప్రిల్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన పేలుళ్లకు సంబంధించి 30 ఏళ్ల భత్కల్ను ఇంటరాగేట్ చేయడానికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం కర్నాటక పోలీసులకు అనుమతి ఇచ్చింది.
ఉత్తర కర్నాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ పట్టణానికి చెందిన యాసిన్ భత్కల్కు అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పుణె, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని ఎన్ఐఏ చెప్తున్న విషయం తెలిసిందే.
కాగా, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ తీవ్రవాది యాసిన్ భత్కల్ను విడిపించేందుకు తీవ్రవాద సంస్థలు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందన్నది నిఘా వర్గాలు హెచ్చరిక.
విమానాశ్రయాల్లో దాడులకు పాల్పడటం, విమానాల హైజాక్కు యత్నించే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో గస్తీ ముమ్మరమైంది. జనవరి 26న అదను చూసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని నిఘా వర్గాలు రాష్ట్రాలను హెచ్చరించాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. దానిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రహస్యంగా భత్కల్ విచారణ
తీహార్ జైల్లో ఉన్న భత్కల్ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతితో శనివారం అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు నగరంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లకు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మల్లేశ్వరంలోని బిజెపి కార్యాలయం వద్ద గత ఏడాది జరిగిన పేలుళ్లకు కారకుడిగా భావించి విచారణ జరుపుతున్నారు. వీటితో పాటు మంగళూరు, ఉడిపి ప్రాంతాలకు భత్కల్ను తీసుకెళ్లి విచారణ జరిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.