తేజ్పాల్ అరెస్టుకి రంగం సిద్ధమౌతోందా? పోర్ట్లలో అలర్ట్
పనాజీ: లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా తరుణ్ తేజ్పాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. బాధితురాలు మౌనం వీడి, తేజ్పాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం, రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం వంటివి చూస్తుంటే తరుణ్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
తేజ్పాల్ దేశం వదిలిపోకుండా గోవా పోలీసులు అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేయడం గమనార్హం. మంగళవారం గోవా పోలీసుల కదలికలు పెరిగాయి. ఢిల్లీ హైకోర్టులో తేజ్పాల్కు మధ్యంతర రక్షణ కల్పించొద్దని గట్టిగా వాదించిన పోలీసులు ముంబైలో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు.
ఈ నెల 18వ తేదీన పత్రికా యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం తప్ప ఇప్పటి వరకు విషయం బయటపెట్టని బాధితురాలు మంగళవారం పోలీసుల ఎదుట గొంతు విప్పారు. యాజమాన్యానికి చేసిన ఫిర్యాదులోని అంశాలనే వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు ద్రువీకరించారు.
మరోవైపు, తెహల్కాలో నిరసన రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. పత్రికలో సీనియర్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్న రాణా అయూబ్ మంగళవారం తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. తేజ్పాల్ను కాపాడేందుకు పత్రికా యాజమాన్యం, సోమా చౌధురిలు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగానే వైదొలుగుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెహల్కా వాటాదార్ల నుంచీ క్రమంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
తేజ్పాల్ తన నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సిందే నని పత్రికలో అత్యధిక వాటాదారు, టిఎంసి ఎంపి కెడి సింగ్ స్పష్టం చేశారు. "తరుణ్ నా స్నేహితుడు. ఇప్పటిదాకా మేము చూసిన తరుణ్, ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన చట్టానికి లొంగిపోవాలి. తప్పు జరిగి ఉంటే ఫలితం అనుభవించాలి'' అన్నారు. తెహల్కాలో నేరుగా తనకు ఏ వాటాలూ లేవని, తన సంస్థల్లో ఒకటి అందులో పెట్టుబడి పెట్టిందని చెప్పారు. తానెప్పుడూ ఆ కార్యాలయానికి వెళ్లలేదని, బోర్డు సమావేశాల్లో పాల్గొనలేదని వివరించారు. తేజ్పాల్తో పాటు సోమా చౌధురిని వెంటనే అరెస్టు చేయాలని గోవా మహిళా కమిషన్ డిమాండ్చేసింది.