ఉగ్రఘాతుకం: జమ్మూలో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి చంపేశారు
సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలు మితీమీరిపోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని రెండు గ్రామాల నుంచి నలుగురు పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇందులో ముగ్గురిని చంపేయగా మరొక పోలీస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నాడు. పోలీసులను కిడ్నాప్ చేసింది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు.
భారత జవాను గొంతుకోశారు..కనుగుడ్లు పీకేసి దూరంగా విసిరేశారు
ఇదిలా ఉంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకో జమ్మూ పోలీసులు ప్రత్యేకించి ఎస్పీలు రాజీనామా చేయాల్సిందిగా హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కిడ్నాప్ అవడం చూస్తే ఇది కచ్చితంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులను షోపియన్ జిల్లాలోని కాప్రిన్, బటాగుండ్ గ్రామాల నుంచి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన పోలీసులను ఫిర్దోస్ అహ్మద్ కూచే, కుల్దీప్ సింగ్, నిసార్ అహ్మద్ ధోబి, ఫయాజ్ అహ్మద్ భట్లుగా గుర్తించారు. ఇందులో ఫిర్దోస్ అహ్మద్ కూచే, కుల్దీప్ సింగ్, నిసార్ అహ్మద్ ధోభీల మృతదేహాలను షోపియన్లో పడేశారు.
ఈ ఘటన పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించగానే జరగడం విశేషం. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, షా మెహ్మూద్ ఖురేషిలు న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భేటీ అవుతారని భారత్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం భారత జవాను నరేంద్ర కుమార్ను పాక్ సైనికులు తీసుకెళ్లి గొంతుకోసి చంపడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడమేంటంటూ తీవ్రంగా విమర్శించాయి.