పోలీసులు, లాయర్లు డిష్యూం, డిష్యూం.. కాల్పులు, పోలీసు జీపుకు నిప్పు...
ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది. గొడవకు గల కారణం తెలియకపోయినా.. పోలీసులు, లాయర్లు గొడవకు దిగారు. లాయర్లపై పోలీసులు చేయిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో కోపోద్రిక్తుడైన ఓ లాయర్ పోలీసు జీపుకు నిప్పంటించడంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
తీస్ హజారీ కోర్టు వద్ద గల పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. కానీ లాయర్ల వాదన మరోలా ఉంది. కోర్టు ప్రాంగనంలో ఓ లాయర్ వస్తోండగా పోలీసు వాహనం ఢీ కొందని తీస్ హజారీ బార్ అసోసియేషన్ తెలిపింది. తమ ముందు కొందరు పోలీసులు లాయర్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారని.. దాడి చేశారని పేర్కొన్నారు. వెంటనే తాము కలుగజేసుకున్నామని వివరించారు.
అలా అలా.. వారి మధ్య మాటల నుంచి చేతల వరకు వెళ్లింది. లాయర్ను ఢీ కొన్న పోలీసు జీపును తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది. ఇంతలో కొందరు పోలీసులు కాల్పులు కూడా జరిపారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు తమపై దాడి ఘటనను పోలీసు ఉన్నతాధికారులు, జడ్జీ దృష్టికి తీసుకెళ్లామని లాయర్లు చెప్తున్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ లాయర్ సెయింట్ స్టిఫెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. కోర్టు వద్ద పరిస్థితి చేయిదాటడంతో అదనపు బలగాలను మొహరించారు.