ఐపీఎస్ ల బదిలి: తప్పించుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం శిష్యుడు, 30 రోజులు!
బెంగళూరు: మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, భారత్ నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోయిన రషీద్ మలబారి మరోసారి భారత్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నెల రోజుల పాటు విదేశాల్లోని జైల్లో ఉన్న రషీద్ మలబారి మన పోలీసు అధికారుల నిర్లక్షం వలన మరోసారి తప్పించుకున్నాడు.
భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో రషీద్ మలబారి ఉన్నాడు. ఇతని మీద కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్క కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు, ఉడిపి, బెళగావిలో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, హఫ్తా వసూలు చేశాడని 16కు పైగా కేసులు నమోదు అయ్యాయి.
బాంగ్లాదేశ్ లో నకిలీ పాస్ పోర్టు తీసుకుని ప్రయాణిస్తున్నాడని గుర్తించిన అబుదాబి పోలీసులు జూన్ 28వ తేదీన రషీద్ మలబారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రషీద్ మలబారి మీద నమోదు అయిన కేసుల వివరాలు, అతనికి దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాల వివరాలు మొత్తం మంగళూరు పోలీసుల దగ్గర ఉన్నాయి.
కర్ణాటక పోలీసుల దగ్గర ఉన్న సాక్షాలు ఇంటర్ పోల్ అధికారుల ద్వారా అబుదాబికి పంపించి రషీద్ మలబారిని అరెస్టు చెయ్యడానికి ఆ రాష్ట్ర పోలీసు అధికారులకు 30 రోజులు అవకాశం ఉంది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఐపీఎస్ అధికారుల బదిలీలు మొదలైనాయి.
రషీద్ మలబారి విషయం తెలిసినా కర్ణాటక ఐపీఎస్ అధికారులు బదిలీల బిజీలో ఉండిపోవడంతో అతన్ని అరెస్టు చెయ్యలేకపోయారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో అబుదాబి పోలీసులు రషీద్ మలబారికి బెయిల్ మంజూరు చెయ్యడంతో అతను చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. పోలీసు అధికారలు నిర్లక్షం వలనే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు రషీద్ మలబారి తప్పించుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.