ఉగ్రవాదులకు పోలీసు అధికారి అండ: శ్రీనగర్లో కారులో కలిసి ప్రయాణిస్తుండగా అరెస్టు
ఉగ్రవాదులకు పోలీసులే సాయం చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఇందుకు నిదర్శనం తాజా ఘటనే. శ్రీనగర్ విమానాశ్రయంలో యూంటీ హైజాకింగ్ యూనిట్లో డీఎస్పీగా పనిచేస్తున్న దవీందర్ సింగ్ ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు. శ్రీనగర్లోని జమ్మూ కశ్మీర్ నేషనల్ హైవేపై ఉన్న చెక్ పాయింట్ వద్ద వీరిని అరెస్టు చేశారు. గతేడాది దవీందర్ సింగ్ రాష్ట్రపతి నుంచి శౌర్య పురస్కారం అందుకున్నారు.
హిజ్బుల్ కమాండర్తో కలిసి డీఎస్పీ దవేందర్ ప్రయాణం
గురువారం రోజున జమ్మూ కశ్మీర్లో పరిస్థితులను సమీక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన విదేశీ రాయబారుల బృందంను శ్రీనగర్ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్నవారిలో దవీందర్ సింగ్ ఉన్నారు. దవీందర్ హిబ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో కలిసి ఓ ప్రైవేట్ వాహనంలో ప్రయాణించారని పోలీసులు తెలిపారు. అందులో హిజ్బుల్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాక్, బత్పోరా నివాసి అయిన రఫి రథర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రఫి రథర్ గతేడాది ఉగ్రవాదులతో చేరిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక ఇర్ఫార్ షఫి అనే మరో లాయర్ ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పక్కా సమాచారం అందడంతోనే...
ఆదివారం రోజున ఇద్దరు మిలిటెంట్లు ఐ10 కారులో షోపియన్ నుంచి జమ్మూ శ్రీనగర్ హైవేపై వస్తున్నట్లు సమాచారం అందిందని ఎస్పీ ఐజీ విజయ్ కుమార్ను అలర్ట్ చేసినట్లు చెప్పారు. వెంటనే సౌత్ కశ్మీర్ డీఐజీని చెక్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఇద్దరు ఉగ్రవాదులు అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు విజయ్ కుమార్ వెల్లడించారు. ఒక సీనియర్ ఆఫీసరుగా ఉండి ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని దవేందర్ సింగ్ను ఉద్దేశించి అన్నారు ఐజీ విజయ్ కుమార్. ఉగ్రవాదుల వేటకోసం జరిగిన పలు ఆపరేషన్లలో కూడా దవేందర్ సింగ్ పాల్గొన్నారని చెప్పిన విజయ్ కుమార్ ఇప్పుడు అదే ఉగ్రవాదులకు సహకరించడం అత్యంత హేయమైన చర్య అని చెప్పారు. దవేందర్ సింగ్ను కూడా ఇప్పుడు ఉగ్రవాదిలానే చూస్తున్నామని చెప్పిన విజయ్ కుమార్ అతన్ని రిమాండ్లోకి తీసకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
ఉగ్రవాదుల కారులో ముందు సీటులో కూర్చున్న దవేందర్
దవేందర్ సింగ్ను అరెస్టు చేసిన తర్వాత అతని నివాసం నుంచి రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక చెక్పాయింట్ వద్ద వాహనాన్ని అడ్డుకున్న సమయంలో దవేందర్ సింగ్ కారు ముందు సీటులో కూర్చోగా ఇద్దరు మిలిటెంట్లు వెనక సీట్లో ఉన్నట్లు చెప్పారు. వారిని ఇంటరాగేషన్ కోసం కుల్గాం జిల్లాకు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నవీద్ ముస్తాక్ ఒకప్పుడు కానిస్టేబుల్
ఇక పట్టుబడ్డ హిజ్బుల్ కమాండర్ నవీద్ ముస్తాక్ ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్గా పనిచేశాడని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. సాధారణ పౌరులు, పోలీసులు, ట్రక్ డ్రైవర్లను చంపిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ముస్తాక్ ఉన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. గతేడాది చాలా వరకు యాపిల్ తోటలను ధ్వంసం చేసి పలువురిని బెదిరించిన కేసులో కూడా నవీద్ ఉన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే నవీద్ ముస్తాక్, డీఎస్పీ సింగ్ల మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారు ఎలాంటి ప్రణాళిక రచించారు.. ఎక్కడికి వెళుతున్నారనేదానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.