మద్రాస్ ఐఐటీలో ఉద్రిక్త పరిస్థితులు, లాఠీచార్జ్?
చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. తరువాత విద్యార్థులు పోలీసుల మీదకు తిరగబడ్డారు.
నిరసనలు తెలిపే హక్కు తమకుందని విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను చితకబాదడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాంపస్ ఆవరణంలోకి వెళ్లడానికి మీడియాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు పలు జాగ్రతలు తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారని ఫిర్యాదులు రావడంతో మద్రాస్ ఐఐటీలోని అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ (ఏపీఎస్ సీ) అనే విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై దేశంలోని పలు ఐఐటీ కాలేజ్ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
దేశంలోని ఐఐటీ కాలేజ్ లలోని విద్యార్థులు మంగళవారం ధర్నాలు నిర్వహించి ఫేస్ బుక్ లో ఫోటోలు అప్ లోడ్ చేశారు. అదే విదంగా తమిళనాడులోని పలు పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు మద్రాస్ ఐఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు.