ల్యాండ్ మాఫియా జాబితాలో ఎంపీ అజాంఖాన్ పేరు..జౌహార్ వర్శిటీలో పోలీసుల సోదాలు
రాంపూర్ : వివాదాస్పద ఎంపీ అజాంఖాన్కు కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్పూర్లోని అజాంఖాన్కు చెందిన జౌహార్ యూనివర్శిటీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ భూమిలోకి యూనివర్శిటీ గేటు రావడంతో వెంటనే తొలగించాలని సబ్డివిజినల్ మెజిస్ట్రేట్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే రాంపూర్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో నుంచి పోలీసులు జౌహార్ యూనివర్శిటీ గేట్ వద్దకు చేరుకున్నారు. అయితే వీరంతా ఎందుకు వచ్చారో అనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం భూమిలోకి యూనివర్శిటీ గేట్ నిర్మించినందున దాన్ని తొలగించాలంటూ జూలై 25వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సమయం 15 రోజులు ఇచ్చింది. ఒకవేళ గేటును 15 రోజుల్లోగా తొలగించకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తొలగిస్తుందంటూ హెచ్చరించింది. హెచ్చరికలతో పాటు కోర్టు అజాం ఖాన్కు రూ.3.27 కోట్లు భారీ జరిమానా విధించింది.అంతేకాదు 15 రోజులకు గాను రోజువారి లెక్కన రూ. 9లక్షల10వేలు జరిమానా విధించింది. గేటును తొలగించే వరకు జరిమానా విధించడం జరుగుతుందని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే అజాంఖాన్పై భూకబ్జాలు చేశారని 26 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అంతేకాదు ల్యాండ్ మాఫియా జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అజాం ఖాన్ పేరును కూడా చేర్చింది.
అజాంఖాన్తో పాటు యూనివర్శిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న మాజీ డీఎస్పీ అయిన అలీ హసన్పై కూడా స్థానిక రైతులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన జయప్రదను తాను ఓడించడం వల్లే బీజేపీ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని అజాం ఖాన్ ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని చెప్పారు. తన చుట్టూ శతృవులు ఉన్నారని ధ్వజమెత్తారు అజాంఖాన్.