కారులో కట్టకట్టలుగా కొత్త కరెన్సీ
గుజరాత్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇంకా బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ తిరుగుతున్నారు.కాని, గుజరాత్ లో మాత్రం ఓ కారులో కొత్త కరెన్సీతో వెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. కట్టలు కట్టలుగా నోట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతోంటే గుజరాత్ లో మాత్రం కారులో కరెన్సీ కట్టలు కట్టలుతా తీసుకెళ్ళుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇంత పెద్ద ఎత్తున నగదు వారికి ఎలా వచ్చిందనే విషయమై ఐటి శాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
అహ్మదాబాద్ లోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారుతి స్విప్ట్ కారులో ప్రయాణిస్తున్నారు.ఈ వాహానాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. కారును తనిఖీ చేస్తే ఈ కారులో కొత్త కరెన్సీ కట్టలు దొరికాయి. కారునిండా కొత్త కరెన్సీ దొరకడం పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రెండువేల రూపాయాల నగదు, ఐదు వందల రూపాయాల నగదు కట్టలు కారులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సుమారు 12.4 లక్షల విలువైన కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తమ కుటుంబంలో వివాహం ఉందని,ఈ వివాహం కోసం పలు బ్యాంకుల నుండి ఈ డబ్బును డ్రా చేసుకొని తీసుకెళ్తున్నట్టు వారు పోలీసులకు చెప్పారు. అయితే వివాహనికి సంబందించిన ఆధారాలను చూపాలని పోలీసులు కోరగా ఆధారాలను చూపలేదు.ఈ నగదును పోలీసులు స్వాథీనం చేసుకొని ఆదాయపు పన్ను శాఖాధికారులకు అప్పగించారు.