కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
శివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ, పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మద్యాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు.
ధనప్రవాహం: గుంటూరులో బంగారం, విశాఖలో నగదు, కడపలో చీరెలు..!
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా నాలుగు రోజులుగా అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో- కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లువెలుగు చూశాయి. 7,526 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శివమొగ్గ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బసవరాజ్ తెలిపారు. ఈ మద్యం విలువ 35, 21, 491 రూపాయలుగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు.
మద్యం బాటిళ్లతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో ఏడుమందిని అరెస్టు చేశామని అన్నారు. వారిని జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణలకు తరలిస్తున్నట్లు తాము అనుమానిస్తున్నామని, మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉందని అన్నారు.