సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య: చెన్నైలో ఏం జరుగుతోంది, జయ సమాధి!
చెన్నై: చెన్నైలో పోలీసుల వరుస ఆత్మహత్యలు ఆశాఖలో కలకలంరేపుతున్నాయి. ఇటీవల ఓ పోలీసు చెన్నైలోని మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. జయలలిత సమాధి దగ్గర పోలీసు ఆత్మహత్య చేసుకున్న రెండు మూడు రోజులకే మరో పోలీసు అధికారి చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నాడు.చెన్నైలో ఏం జరుగుతోంది అంటూ తమిళనాడు పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్ఐ నైట్ డ్యూటి
చెన్నైలోని ఆయనవరమ్ పోలీస్ స్టేషన్ లో సతీష్ కుమార్ (33) సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సతీష్ కుమార్ మంగళవారం రాత్రి విధులకు హాజరైనాడు. సతీష్ కుమార్ అర్దరాత్రి ఆయనవరమ్ ప్రాంతంలో శాంతిభద్రతలు పర్యవేక్షించాడు.
ఎస్ఐ సర్వీస్ రివాల్వర్
బుధవారం వేకువ జామున సతీష్ కుమార్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడు. వెంటనే విషయం గుర్తించిన సాటి సిబ్బంది సతీష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సతీష్ కుమార్ మరణించాడని వైద్యులు తెలిపారు.
ఉద్యోగంలో ఒత్తిడి
సతీష్ కుమార్ కు కొంత కాలం నుంచి సెలవు ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు చెయ్యాలని పై అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. విశ్రాంతి లేకుండా ఉద్యోగం చెయ్యడంతో ఒత్తిడికి గురైన సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హడలిపోయిన పోలీసులు
సబ్ ఇన్స్ పెక్టర్ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న పై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సబ్ ఇన్స్ పెక్టర్ ఆత్మహత్యతో చెన్నైలోని పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే ఓ పోలీసు జయలలిత సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
డెత్ నోట్ లో సమాచారం !
సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టాడని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే సతీష్ కుమార్ డెత్ నోట్ లో ఉన్న వివరాలు చెప్పడానికి చెన్నై నగర పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు.