నా కారు ప్రియుడికిచ్చేసింది: భార్యపై కన్నడ హీరో దర్శన్
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కుటుంబ కలహాల నుంచి బయటపడలేకపోతున్నారు. అతని జీవితం గాడిలో పడిందని అనుకుంటున్న తరుణంలోనే మరోసారి చిక్కుల్లోపడ్డారు. దర్శన్ ప్రవర్తన తనను ఇబ్బంది పెడుతోందని , అతడిని పిలిచి మందలించాలంటూ భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ కలహాలు వీధినపడ్డాయి.
ఇక విజయలక్ష్మి ఫిర్యాదును అనుసరించి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని నమోదు చేయడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఏడాదిన్నర కాలంగా తను వేరుగా ఉంటున్నానని విజయలక్ష్మి చెబుతుండగా , ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, అందుకే ఆ విధంగా వ్యవహరిస్తోందని దర్శన్ చెబుతుండటం గమనార్హం.
వీరి కలహాల వివరాల్లోకి వెళితే.. భర్త దర్శన్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో విజయలక్ష్మి ఏడాదిన్నర కాలంగా వేరుగా ఉంటున్నారు. వీరి కుమారుడు సైతం తల్లితోనే ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయలక్ష్మి నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చిన దర్శన్ అక్కడి సెక్యూరిటీ తో ఘర్షణ పడటంతో పాటు భార్య విజయలక్ష్మిని అసభ్య పదజాలంతో విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు.
అక్కడికి చేరుకున్న చెన్నమ్మన్న కెరె అచ్చుకట్ట స్టేషన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని ఫిర్యాదు నమోదు చేశారు. కాగా, రెండేళ్లుగా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలిత్తినట్టు తెలుస్తోంది.
నా కారును ఆమె ప్రియుడికి ఇచ్చింది: దర్శన్
' నేను కొన్న లగ్జరీ ఆడీ కారు విజయలక్ష్మి తన ప్రియుడికి ఇచ్చింది. అతను నా వాహనంలో తిరుగుతున్నాడు. ఆ కారుకు ప్రమాదం కూడా చేశాడు. దాన్ని చూసి ఆ విషయాన్ని అడిగేందుకు విజయలక్ష్మి ఫ్లాట్ వద్దకు వెళ్లాను. అంతే తప్ప నేను ఏ రకంగానూ గొడవ చేయలేదు. విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్కు సంబంధించిన నిర్వహణ ఖర్చులతో పాటు ఇంటి అవసరాలకు కూడా నేనే డబ్బులు సమకూరుస్తున్నాను. అయినా నన్ను కనీసం ఇంటిలోకి రానివ్వకుండా సెక్యూరిటీతో అడ్డుకున్నారు అని దర్శన్ తెలిపారు.
ఈ నేపధ్యంలోనే సెక్యూరిటీతో గొడవ జరిగిందని వివరించారు. అంతేతప్ప తాను ఎవరి పైనా దాడికి దిగలేదని అన్నారు. తన ఎదుగుదలను చూడలేకనే ఇదంతా చేస్తున్నారని దర్శన్ ఆరోపించారు. ఇదే సమయంలో సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వద్ద కూడా దర్శన్ తన వాదనను వినిపించినట్టు తెలుస్తోంది.
' మూడు రోజులుగా నా బిడ్డను చూడలేదు. నా కొడుకును చూసేందుకు ఫ్లాట్ వద్దకు వెళితే నన్న అడ్డుకున్నారు. రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నా వాటిని పరిష్కరించేందుకు ఎవరూ రాలేదు. నాకు కాస్త సమయం ఇవ్వండి, నా వాదనను కూడా వినండి' అని దర్శన్ కమిషన్కు వివరించినట్లు తెలిసింది. ఇక ఈ కేసు విషయంలో తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే విశ్రాంతి కోసం మైసూరు వెళుతున్నట్టు దర్శన్ చెప్పారు.
అవాస్తవాలు: విజయలక్ష్మి
ఇదిలా ఉండగా, తనకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని దర్శన్ భార్య విజయలక్ష్మి తెలిపారు. 'నాకు ఏ బాయ్ఫ్రెండ్ లేడు. నేను కొంతకాలం పాటు దర్శన్ నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన నా గురించి ఇలాంటి అసత్య ప్రసారాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. నేను చాలా మంచి కుటుంబం నుంచి వచ్చాను. నాబిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నేను దర్శన్ నుండి దూరంగా ఉంటున్నాను' అని విజయలక్ష్మి తెలిపారు
కాగా, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ విజయలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్.. ఆమె భర్త దర్శన్కు సమన్లు జారీ చేసింది. తనపై దాడి చేశారంటూ విజయలక్ష్మి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు కూడా దర్శన్ పై ఫిర్యాదు చేశాడు.