హైడ్రామా: కోల్కతా సీపీ ఇంటికి సీబీఐ, అడ్డుకున్న పోలీస్, కాపాడేందుకు రంగంలోకి దిగిన మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ పోలీసులు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులను అడ్డుకున్నారు. తొలుత సీబీఐ అధికారులు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. నగర కమిషనర్ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు.
అసలేం జరిగిందంటే?
రోజ్ వ్యాలీ, శారదా పోంజీ స్కాం కేసుల్లో విచారణ జరుపుతున్న సీబీఐ ఈ కేసుకి సంబంధించిన కొన్ని పత్రాలు మాయం కావడంతో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కి సమన్లు జారీ చేసింది. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని భావించారు. కానీ హఠాత్తుగా కనబడకుండా వెళ్లారు. ఇప్పుడు సీబీఐ అధికారులకు ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు.
సీబీఐ ఆధికారులను పోలీస్ స్టేషన్ తరలించారు
కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైడ్రామా కనిపించింది. రాజీవ్ను విచారించేందుకు కావాల్సిన సంబంధిత పత్రాలు ఉన్నాయా? అంటూ సీబీఐ బృందాన్ని పోలీసులు అడిగారు. సీబీఐ అధికారులను అదుపులోనికి తీసుకొని, వారిని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. స్కాం కేసులో విచారణకు హాజరు కానీ సీపీని కాపాడేందుకు మమత ఆయన ఇంటికి వచ్చారు. ఆమెనే కాదు, డీజీపీ కూడా ఆయన ఇంటికి రావడం గమనార్హం.
ఈ హైడ్రామాపై ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ.. దీని గురించి తాము ఇప్పుడు ఏమీ మాట్లాడమని, ఏం జరుగుతుందో చూద్దామని, కాసేపు వేచి చూడండని అన్నారు. మరోవైపు, కోల్కతా పోలీస్ కమిషనర్ తన విధులకు హాజరవుతూనే ఉన్నారని, కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టారని బెంగాల్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేయవద్దన్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదనేది ఇక్కడ ప్రశ్న. బెంగాల్లో చిట్ ఫండ్ కుంభకోణం, రోజ్ వ్యాలీ స్కాంలు కలకలం రేపాయి.
టీఎంసీ ఎంపీ ఏమన్నారంటే?
హైడ్రామాపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఒ బ్రెయిన్ మాట్లాడుతూ... బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, 40 మంది సీబీఐ అధికారులు... కోల్కతా పోలీస్ కమిషనర్ ఇంటిని చుట్టుముట్టారని, సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, దీనిని తాము పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. మోడీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. విపక్షాలన్ని కలిసి ఏకతాటిపైకి వస్తామన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలకు తెరలేపుతోందన్నారు. 2019లో బీజేపీని ఫినిష్ చేయడమే తమ నినాదమని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై నిప్పులు చెరిగారు. రోజ్ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాల కేసుల్లో రాజీవ్ కుమార్ విచారణకు హాజరు కావట్లేదని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్పిన నేపథ్యంలో మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై గతంలోను మండిపడ్డారు.