వ్యాపారి కిడ్నాప్: కటకటాల వెనక్కి పోలీసు
పాట్నా: దుండగులతో కలిసి ఒక కానిస్టేబుల్ వ్యాపారిని కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. దొంగలను పట్టుకుని బేడీలు వెయ్యవలసిన ఆ పోలీసుకు సాటి పోలీసులు బేడీలు వేసి లోపల వేసి విచారణ చేస్తున్నారు.
బీహార్ రాజధాని పాట్నాలోని సచివాలయా పోలీస్ స్టేషన్ లో దీపక్ కుమార్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పాట్నాలోనే ట్రావెల్ ఏజెంట్ సునీల్ కుమార్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నారు. సునీల్ కుమార్ ను కిడ్నాప్ చెయ్యాలని కానిస్టేబుల్ ప్లాన్ వేశాడు.
ఇద్దరు దుండగులతో కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. జూన్ 6వతేదిన వ్యాపారి సునీల్ కుమార్ ను చాకచక్యంగా కిడ్నాప్ చేశారు. తరువాత అతనిని రహస్య ప్రాంతంలో నిర్బందించారు. సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు.
సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. దుండగులతో కానిస్టేబుల్ దీపక్ కుమార్ కు సంబంధం ఉందని వెలుగు చూడటంతో అరెస్టు చేశారు. ఇంతకు ముందు దీపక్ కుమార్ ఎవరినైనా కిడ్నాప్ లు చేశాడా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.