బైక్పై మూత్రం పోసిందని కుక్కపై పోలీసు బుల్లెట్ల వర్షం
హరిద్వార్: తన బైకుపై ఓ శునకం మూత్రం పోయడాన్ని చూసిన ఆ ఖాకీ ఆగ్రహంతో చెలరేగి ఏకంగా తన వద్ద ఉన్న తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. కుక్కపై కానిస్టేబుల్ బుల్లెట్ల వర్షం కురిపించిన సంఘటనపై ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ బుల్లెట్ల వర్షం కురిపించిన సంఘటన హరిద్వార్లోని కంఖాల్ ప్రాంతంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి - ఓ శునకం ఓ మోటార్ సైకిల్ను లక్ష్యంగా చేసుకుని మూత్రం పోసింది. అయితే, ఆ బైక్ వినోద్ చౌహాన్ అనే పోలీసు కానిస్టేబుల్కు చెందినది. తన బండిపై కుక్క మూత్రం పోయడాన్ని చూసిన ఆ పోలీసులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తుపాకీ తీసి కుక్కకు గురిపెట్టి కాల్చాడు. దాంతో కుక్క కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. దాంతో కుక్క బాధతో అరుస్తూ కూలబడిపోయింది.
దాన్ని గమనించిన స్థానికులు కానిస్టేబుల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ కానిస్టేబుల్ వారిని తుపాకీతో బెదిరించాడు. దీంతో వారు వెనక్కి తగ్గారు. చివరకు గాయపడిన కుక్కను ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించి, అనంతరం జంతు పరిరక్షణకు పాటుపడే పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) ఎన్జీవోను కలిసి విషయం వివరించారు.
సంస్థ అధికారి ఒకరు డీజీపీని కలిసి కానిస్టేబుల్ దురాగతంపై సమాచారం అందించగా, డీజీపీ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ శునకం చికిత్స పొందుతోంది. జనవరి 24వ తేదీన ఆ సంఘటన జరిగింది. శుక్రవారంనాడు డిజిపి విచారణకు ఆదేశించారు. జంతువుల పట్ల దారుణంగా వ్యవహరించడం చౌహాన్కు ఇదే మొదటిసారి కాదని పిఎఫ్ఎ ప్రతినిది మానవి భట్ చెప్పారు.