ఇద్దరు పిల్లల నిబంధన చట్టం? దేశంలో జనాభా నియంత్రణ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
దేశంలో జనాభా నియంత్రణకు చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల నిబంధనపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పెరుగుతున్న జనాభా.. దేశానికి సమస్యగా మారిందని మాత్రమే చెప్పానన్నారు. అదే సమయంలో మానవ వనరుగానూ మారిందన్నారు. అయితే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఎంతమంది పిల్లలను కలిగి ఉండాలో ఆ చట్టం నిర్దేశిస్తుందని చెప్పారు. ఎంతమందిని కలిగి ఉండాలనే దానిపై తానేమీ మాట్లాడనని, అది తన పని కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగిన 'భారత భవిష్యత్' కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.
అలాంటి చట్టానికి నా మద్దతు : మోహన్ భగవత్
దేశం అభివృద్ది చెందాలంటే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. అంతకుముందు శుక్రవారం మొరాదాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT)లో మాట్లాడిన మోహన్ భగవత్.. ఇద్దరు పిల్లలను మాత్రమే కలిగి ఉండేలా రూపొందించే చట్టం ఏదైనా.. దానికి తాను మద్దతునిస్తానని చెప్పారు. తమ సంస్థ ఆర్ఎస్ఎస్ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని తప్ప.. మరొకరి మతాన్ని లేదా ఏ రాజకీయ ఆధిపత్యాలను మార్చాలని కోరుకోవడం లేదన్నారు.
రాజ్యాంగ మార్పు..?
ఈ దేశం 130 కోట్ల హిందువులది అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాట్లాడితే.. దాని ఉద్దేశం ఎవరి మతాన్ని,భాషను లేదా కులాన్ని మార్చడం కాదని మోహన్ భగవత్ అన్నారు. రాజ్యాంగ మార్పును తప్ప ఎలాంటి రాజకీయాలను తాము కోరుకోవడం లేదని 'భారత భవిష్యత్' కార్యక్రమంలో స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి నొక్కి చెప్పిన భగవత్.. హిందుత్వ కూడా కలిసి జీవించాలనే చెబుతోందన్నారు.
హిందుత్వ అంటే..
భిన్న ఆలోచనలు ఉన్నప్పటికీ భావోద్వేగ ఐక్యతను సాధించాలని రాజ్యాంగం చెబుతోందని మోహన్ భగవత్ అన్నారు. 'భావోద్వేగం అంటే ఏమిటి.. ఈ దేశం మాకు చెందినది అనే భావన. మేము మా గొప్ప పూర్వీకుల వారసులం.. దేశంలో భిన్నత్వం ఉన్నప్పటికీ కలిసి జీవించాలి. ఇదే హిందుత్వ చెబుతున్నది' అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.