ఐ ఫోన్ లాంటి అమ్మకు ఓటు వేస్తే డబ్బా ఫోన్ లాంటి చిన్నమ్మనా: సెగ !
ప్రజా ప్రతినిధులు ఒక వైపు, ప్రజలంతా ఒక వైపు అన్నట్లుగా మారిన అన్నాడీఎంకేలోని శశికళ వర్గం నిరసన సెగను ఎదుర్కొంటోంది. మంత్రుల కార్ల ముట్టడిస్తూ, సొంత నియోజక వర్గంలో ఎమ్మెల్యేలను అడుగు పెట్టనివ్వకుండా
చెన్నై: ప్రజా ప్రతినిధులు ఒక వైపు, ప్రజలంతా ఒక వైపు అన్నట్లుగా మారిన అన్నాడీఎంకేలోని శశికళ వర్గం నిరసన సెగను ఎదుర్కొంటోంది. మంత్రుల కార్ల ముట్టడిస్తూ, సొంత నియోజక వర్గంలో ఎమ్మెల్యేలను అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నారు.
శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు కనపడితే చాలు నల్లజెండాలతో అడ్డుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో చిన్నమ్మ వర్గీయులు బయటకురావాలంటేనే హడలిపోతున్నారు. ఈ పరిణామాలతో సొంత నియోజకవర్గాల్లోకి వెళ్లేందుకు భీతిల్లుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చెన్నై నగరానికే పరిమితం అవుతున్నారు.
అమ్మకు ఓటు వేస్తే చిన్నమ్మ అంటారా
ఐ ఫోన్ లాంటి అమ్మ జయలలితకు తాము ఓటు వేస్తే డబ్బా ఫోన్ లాంటి చిన్నమ్మ శశికళ కావాలని అంటారా అంటూ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలపై నియోజక వర్గ ప్రజలు మండిపడుతున్నారు. మా నియోజక వర్గంలో అడుగుపెడితే మా సత్తా చూపిస్తాం అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత
మంత్రి సీవీ. షణ్ముగం తన నియోజక వర్గంలోకి అడుగుపెట్టాలంటే హడలిపోతున్నారు. విళుపురం ఉత్తర జిల్లా కార్యదర్శిగా ఫిబ్రవరి 23వ తేదిన తన అనుచరులను అండగా పెట్టుకుని బాధ్యతలు స్వీకరించిన మంత్రి సీవీ. షణ్ముగం సొంత నియోజక వర్గంలోకి వెళ్లడానికి ప్లాన్ వేశారు. అయితే కార్యకర్తలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం రావడంతో చెన్నైకే పరిమితం అయ్యారు.
సొంత నియోజక వర్గంలోకి వెళ్లాలని
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యే కేఎస్. విజయ్ కుమార్ తన సొంత నియోజక వర్గం అయిన గుమ్మిడిపూండిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేసేందుకు వెళ్లారు. స్థానిక ప్రజలు నల్లజెండాలతో పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గర అడ్డుకోవడంతో ఆయన కార్యక్రమానికి హాజరుకాకుండా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
చిన్నమ్మ కావాలా కార్యకర్తలు కావాలా తేల్చుకోండి
ఆరియలూరు ఎమ్మెల్యే తామరై రాజేంద్రన్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణి చెయ్యడానికి ఎలాకురిచ్చీకి బయలుదేరారు. అక్కడి ప్రజలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసి రాజేంద్రన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేంద్రన్ ఎలాకురిచ్చీ రాకుండానే వెనక్కు వెళ్లిపోయారు.
తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనల సెగ
శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల దగ్గర నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులను చెన్నై పిలిపించుకుని అక్కడే క్వాటర్స్ లో కాలం గడుపుతున్నారు.
ఇదే ఆఖరి రాజకీయ జీవితం
అమ్మ జయలలితను చూపి మీకు ఓట్లు వేసి గెలిపించామని, ఈ రోజు డబ్బు, హోదా కోసం శశికళ వర్గానికి మద్దతు ఇస్తున్నారని, మీకు ఇదే ఆఖరి రాజకీయ జీవితం, మీ జన్మలో ఇక గెలువలేరని, మీకు తగిన బుద్ది చెబుతామని అన్నాడీఎంకే కార్యకర్తలు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు.
పోలీసులు అండగా ఉన్నా సరే
మీ నియోజక వర్గాల్లో పర్యటించడానికి తాము భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చినా శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు సొంత నియోజక వర్గాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి దేవుడా అంటూ తలలు పట్టుకుంటున్నారు.