ప్లైఓవర్ ఘటనపై రాజకీయం: సగటు బెంగాలీ మాటిదీ?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని ఉత్తర కోల్కత్తాలో గురువారం మధ్యాహ్నాం 12.30 గంటల సయమంలో అత్యంత రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 25కు చేరింది.
బుధవారం రాత్రికే 21 మంది మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది, శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని కోల్కత్తా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ప్లైఓవర్ కూలిన ఘటనపై తక్షణం ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వీరికి తోడుగా బీజేపీ కూడా గొంతు కలిపింది. ఈ ఘోర దుర్ఘటనకు కారణం దీదీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శిస్తున్నారు.
ప్రమాద విషయం తెలియగానే వెంటనే కోల్కత్తాలోని ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. 2.2 కి.మీ పొడవైన ప్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ 2009లో అప్పటి వామపక్ష ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిందని తెలిపారు.
దీదీ ప్రభుత్వం మాత్రం ఈ దుర్ఘటనకు కారణం ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణమంటూ, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 3 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ. లక్ష ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంది.
అయితే ఇంతటి ఘోర దుర్ఘటనకు కారణం ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం మాత్రమే కాదని, ఐవీఆర్సీఎల్ తో పాటు మమతా బెనర్జీ సర్కారు ఉదాశీన వైఖరి కూడా కారణమని బెంగాల్ ప్రజలు అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు గంటలకు గాని పోలీసులు అక్కడికి చేరుకోలేకపోయారు.
సమాచారం తెలిసి పరుగు పరుగున పోలీసులు వచ్చినా, శిథిలాలను తొలగించడం వారికి సాధ్యం కాలేదు. గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్లు లేకుండా ఎవరైనా ఏమీ చేయలేని పరిస్థితి. ఫ్లై ఓవర్ నిర్మాణంలో వినియోగించిన భారీ కాంక్రీట్ దిమ్మెలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి.
రక్తపు మడుగులో పడిఉన్న శరీర భాగాలు, మాంసపు ముద్దులతో మరుభూమిని తలపించింది. జనాభా పరంగా టాప్ 5 నగరాల్లో ఒకటిగా ఉన్న కోల్కత్తాలో సహాయక సామాగ్రి లేకపోవడం దారుణం. నగరం నడిబొడ్డున ప్రమాదం జరిగితే... అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు అంత సమయం ఎందుకు పట్టింది?
కాస్తంత ఆలస్యంగా వచ్చినా, సహాయక చర్యలు వెనువెంటనే ఎందుకు ప్రారంభం కాలేదు? సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేదాకా సహాయక చర్యలు ఎందుకు ఊపందుకోలేదు? మరో ప్రైవేట్ కంపెనీ స్పందించేదాకా అక్కడికి గ్యాస్ కట్టర్లు ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలు సగటు బెంగాలీలో ఉత్పన్నమయ్యాయి.
ఈ మొత్తం దుర్ఘటనలో ప్రమాదానికి ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణమైతే... పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి మాత్రం సహాయక చర్యల్లో నెలకొన్న జాప్యమేనని బెంగాలీలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్లైఓవర్ కూలిన ఘటనలో కోల్కత్తాకు చెందిన విచారణ బృందం ఐవీఆర్సీఎల్ ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు గాను శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని సంస్ధ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆ సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. ఈ విచారణలో ఐవీఆర్సీఎల్ ఉన్నతాధికారులు సరైన సమాధానాలు చెప్పని పక్షంలో సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.